భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలి  | Sakshi
Sakshi News home page

భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలి 

Published Fri, Jun 16 2023 4:42 AM

Safety measures must be followed strictly - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): ప్రయాణికుల అంచనాలకు తగిన విధంగా అన్ని శాఖల అధికారులు రైల్వే­శాఖ నిర్దేశించిన విధంగా రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్య­లను కచ్చితంగా పాటించా­ల­ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ సూచించారు. గురువారం సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్‌లో విజయవాడ డివిజన్‌లోని పలు శాఖల అధికారులు, సిబ్బందితో రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలు అనే అంశంపై డీఆర్‌ఎం షివేంద్రమోహన్, ఏడీఆర్‌ఎం ఎం.శ్రీకాంత్‌తో కలసి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ సెమినార్‌ నిర్వహించారు.

సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది ఈ సెమినార్‌లో పాల్గొన్నారు. ముందుగా ఏడీఆర్‌ఎం శ్రీకాంత్‌ ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డిపార్ట్‌మెంట్‌ వారీగా చేపడుతున్న భద్రత చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ భధ్రత నిర్వహణలో ప్లాన్‌–బి లేదని,  పరిపాలనశాఖ నిర్దేశించిన నియమ, నిబంధనలను కచ్చితంగా  పాటించాలని సిబ్బందికి సూచించారు.

రోలింగ్‌ బ్లాక్‌ ప్రోగ్రామ్‌ ఎంతో విలువైనదని, దాన్ని అమలు చేయాలన్నారు.  డీఆర్‌ఎంతో కలసి లోకో పైలట్‌లు, సీఎల్‌ఐ, టీఆర్‌డీ అండ్‌ ఎలక్ట్రికల్‌ సిబ్బందితో సమీక్షించి ఫీల్డ్‌స్థాయిలో వారి ఎదుర్కొంటున్న  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయంలో సెక్షన్‌ కంట్రోలర్స్‌తో సమావేశం నిర్వహించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement