
రాష్ట్రానికి తప్పిన తీవ్ర అల్పపీడనం ముప్పు
నేడు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల ఫెంగల్ తుపాన్తో వణికిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు.. మరోసారి అదే వైపుగా అల్పపీడనం వస్తుండటంతో ఆందోళనకు గురవుతుండగా.. ఆ భయం వద్దని వాతావరణశాఖ ధైర్యం చెప్పింది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని స్పష్టం చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు.
ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గురువారం కోస్తా జిల్లాల్లో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొన్నారు.