12 నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు 

Railways To Run New Special Trains From Sep 12th - Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని స్పెషల్‌ రైళ్లు ఈ నెల 12వ తేదీ నుంచి దేశ్యవ్యాప్తంగా నడుపనున్నారు. వీటిలో ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్‌ డివిజన్‌ పరిధి విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించింది. ఈ స్పెషల్‌ రైళ్లకు రిజర్వేషన్‌ ఈ నెల 10వ తేదీనుంచి ప్రారంభమవుతుందని వాల్తేర్‌ డివిజనల్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కే.త్రిపాఠి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..)

ప్రత్యేక రైళ్ల వివరాలు... 
విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం (08518/8517) డైలీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12వ తేదీ నుంచి విశాఖలో ప్రారంభమై ప్రతిరోజు రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి కోర్బాలో ప్రారంభమై  ప్రతిరోజు సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, కేసింగ, టిట్లాఘడ్, కంటాబంజి, ఖరియార్‌ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్, టిల్డా నియోరా, భతపరా, బిలాస్‌పూర్, అకల్తరా, జంజ్‌గిరినైలా, చంపా స్టేషన్‌లలో ఆగుతుంది. (చదవండి: గాజువాక సీఐకి నూతన్ ‌నాయుడు ఫోన్‌..

విశాఖ మీదుగా నడిచే రైళ్లు 
తిరుచ్చిరాపల్లి–హౌరా–తిరుచ్చిరాపల్లి( 02664 / 02663) వీక్లీ స్పెషల్‌ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమై ప్రతి మంగళ, శుక్రవారాలలో  సాయంత్రం 4.20గంటలకు తిరుచ్చిరాపల్లిలో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో హౌరాలో  17 నుంచి ప్రారంభమై ప్రతి గురు, ఆది వారాలలో సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్‌ స్టేషన్‌లలో ఆగుతుంది. 
 

గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్‌–గౌహతి(02509 / 02510) ట్రై వీక్లి స్పెషల్‌ రైలు గౌహతిలో 13 నుంచి ప్రారంభమై ప్రతి ఆది, సోమ, మంగళవారాలలో ఉదయం 6.20గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్‌లో 16 నుంచి ప్రారంభమై ప్రతి బుధ, గురు, శుక్రవారాలలో రాత్రి 11.40గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను రన్‌గియా, న్యూ జల్పయ్‌గురి, మాల్డా టౌన్, హౌరా, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్‌ కియోంఝర్‌ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఇతర ముఖ్య స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది.  
ఈ స్పెషల్‌ రైళ్లకు టికెట్స్‌ రిజర్వేషన్‌ కౌంటర్స్‌ వద్ద, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని, కేవలం కన్ఫర్మ్‌ టికెట్స్‌ ఉన్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top