
ఆర్టీఈ కింద అడ్మిషన్లను తిరస్కరిస్తున్న ప్రైవేట్ స్కూళ్లు
ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను చేర్చుకునేందుకు ససేమిరా
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ చిన్నారికి ఒకటో తరగతిలో ప్రవేశం కోసం తల్లిదండ్రులు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) చట్టం కింద స్థానికంగా ఉన్న మూడు ప్రైవేటు పాఠశాలలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మే 28న తొలి విడతలో స్థానికంగా పేరున్న ఓ పాఠశాలలో సీటు కేటాయించారు. దీంతో తల్లిదండ్రులు విద్యార్థితో కలిసి సదరు పాఠశాలలో దరఖాస్తు సమర్పించారు.
గడువు ముగిసినా ఆ స్కూల్ నుంచి సమాచారం రాకపోవడంతో మరోసారి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని సంప్రదించగా అడ్మిషన్ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఇదేమని అడిగితే.. ప్రభుత్వం ఫీజు ఖరారు చేయలేదు, కోర్టులో కేసు ఉంది.. సీటు ఇవ్వలేమని చెప్పారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు అధికారులకు చెబితే ‘చేర్చుకోకపోతే నోటీసులిస్తా’మని చెబుతున్నారేగాని చర్యలు తీసుకోవడం లేదు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు అపహాస్యం పాలవుతున్నాయి. సీట్లు పొందిన విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. నిజానికి.. ఆర్టీఈ చట్టం కింద ప్రైవేటు స్కూళ్లల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి.
ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ప్రతి విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించి అర్హత గల విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తుంది. గత మూడు విద్యా సంవత్సరాలు సక్రమంగా జరిగిన ఈ ప్రక్రియ 2025–26 విద్యా సంవత్సరానికి మాత్రం మొక్కుబడిగా సాగుతోంది. రెండు విడతల్లో 31,701 మంది పిల్లలకు సీట్లు కేటాయించగా, ఇందులో సగం మందిని కూడా ఆయా స్కూళ్లు చేర్చుకోలేదు.
పైగా.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆయా పాఠశాలలకు ‘ఆర్టీఈ’ ప్రవేశాలకు ఫీజులు ఖరారుచేయాల్సిన ప్రభుత్వం జూలై వస్తున్నా మీనమేషాలు లెక్కిస్తోంది. రెండు నెలల క్రితం ఉన్నతాధికారులతో ఫీజుల ఖరారుకు కమిటీని నియమించి వదిలేసింది. ఇక ఎంపికైన విద్యార్థులు ఆయా స్కూళ్లకు వెళ్తే వాటి నిర్వాహకులు వారిని వెనక్కి పంపించేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. ‘సీట్లు కేటాయించాం.. చేర్చుకోకపోతే నోటీసులిస్తా’మంటూ చేతులు దులిపేసుకుంటున్నారు.
31,701 మంది సీట్లు.. సగం మందికే
ఇదిలా ఉంటే.. ఆర్టీఈ చట్టం కింద అర్హులైన పేద పిల్లలకు ఈ ఏడాది ఒకటో తరగతిలో ప్రవేశాలకు మే 2 నుంచి 19 వరకు రాష్ట్ర సమగ్ర శిక్ష విభాగం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 37,427 మంది నమోదు చేసుకోగా 28,561 మంది అర్హత సాధించారు. వీరిలో మొదటి విడత కింద మే 28న లాటరీ పద్ధతిలో 23,118 మందికి సీట్లు కేటాయించగా 15,541 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. 1,200 మందికి కోరుకున్న పాఠశాలలు రాకపోవడంతో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రాలేదు. మిగిలినచోట్ల ప్రైవేటు పాఠశాలలు ఉచిత ప్రవేశాలను తిరస్కరించాయి. ఇక రెండో విడతలో.. 8,583 మందికి సీట్లు కేటాయించారు.
ప్రైవేటు పాఠశాలల కుంటిసాకులు
మొదటి విడతలోనే ప్రవేశాలు కల్పించని ప్రైవేటు పాఠశాలలు రెండో విడతలోనూ ససేమిరా అంటున్నాయి. దీంతో.. అధికారులు ప్రవేశాలను జూలై 2 వరకు పొడిగించారు. పిల్లల చేరికలపై ఆయా యాజమాన్యాలను అడిగితే.. తర్వాత చెబుతామని, అధికారులతో మాట్లాడతామని, కోర్టులో కేసు ఉందని ఇలా.. రకరకాల కారణాలు చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇదే విషయమై అధికారులను ఆరా తీస్తే.. పిల్లలను చేర్చుకోని స్కూళ్లకు నోటీసులిస్తామని బదులిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై 19 రోజులైందని.. తమ పిల్లలను ఇంకెప్పుడు బడికి పంపాలని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఉచిత సీటు వచ్చిందన్న ఆనందం కంటే చేర్చుకోవడంలేదన్న ఆందోళనే ఎక్కువగా ఉందంటున్నారు.
వారికి ‘తల్లికి వందనం’ లేదు..
ఇక విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలను 2022–23 నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2023–24, 2024–25 మొత్తం మూడు విద్యా సంవత్సరాల్లో సుమారు 50 వేల మందికి సీట్లు కేటాయించారు. ఇలా సీట్లు ఇచ్చే స్కూళ్ల నుంచి ముందుగా అంగీకారం తీసుకున్నాకే వాటిని కేటాయిస్తారు. గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేశాయి.
ఈ విద్యా సంవత్సరం ఆర్టీఈ కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నేరుగా ఆయా పాఠశాలకే ఫీజు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. తాజాగా అడ్మిషన్లు పొందిన వారికి ‘తల్లికి వందనం’ జమచేయలేదు. మరోవైపు.. ఆర్టీఈ ప్రవేశాలపై ప్రభుత్వం ఇంతవరకు ఫీజులను కూడా ఖరారు చేయలేదు. పైగా గతంలో నిర్ణయించిన ఫీజులు తమకు సరిపోవంటూ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
గతేడాది ఫీజు చెల్లిస్తేనే పైతరగతికి..
2024–25 విద్యా సంవత్సరంలో ఆర్టీఈ కింద దాదాపు 25 వేల మందికి ప్రైవేటు స్కూళ్లల్లో ప్రవేశాలు కల్పించారు. అయితే, వారికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. సమస్యను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పిల్లలను పరీక్షలు రాసే వరకు ఆగిన స్కూళ్ల యాజమాన్యాలు ఆ తర్వాత మళ్లీ ఫీజు చెల్లించమని ఒత్తిడి పెంచాయి.
గతేడాది ఫీజు చెల్లిస్తేనే పైతరగతికి ప్రమోట్ చేస్తామని మెలికపెట్టాయి. కొన్నిచోట్ల పిల్లలను రెండో తరగతిలోకి అనుమతించినా పాఠాలు బోధించడంగాని, పుస్తకాలు ఇవ్వడంగాని చేయడంలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంది.