గ్రానైట్‌ అక్రమార్కులపై విజిలెన్స్‌ పంజా | Prakasam: Vigilance Raids On Granite Units Impose Huge Penalty | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ అక్రమార్కులపై విజిలెన్స్‌ పంజా

Jun 26 2021 3:26 PM | Updated on Jun 26 2021 3:30 PM

Prakasam: Vigilance Raids On Granite Units Impose Huge Penalty - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ హయాంలో గ్రానైట్‌ అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది. అప్పట్లో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్‌ క్వారీల నిర్వాహకులు, వ్యాపారులు అక్రమాలకు తెరలేపగా.. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గనులను అడ్డగోలుగా దోచేశారు. క్వారీల నిర్వాహకులు, లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.కోట్లకొద్దీ రాయల్టీని ఎగ్గొట్టారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మైనింగ్‌ మాఫియా గుట్టురట్టు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా అక్రమాలను వెలుగులోకి తీశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

155 క్వారీల్లో అక్రమాలు
ఇప్పటివరకు జరిపిన విచారణలో 155 గ్రానైట్‌ క్వారీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. వీటి నిర్వాహకులకు రూ.3,527 కోట్లు జరిమానా విధించేందుకు విజిలెన్స్‌ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, పాలిషింగ్‌ యూనిట్లపైనా విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వీరినుంచి కూడా జీఎస్టీ, రాయల్టీ రూపంలో మరో రూ.2 వేల కోట్లు జరిమానా విధించేందుకు సన్నద్ధం కాగా.. గ్రానైట్‌ క్వారీ లీజుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విజిలెన్స్‌ విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై 100 పైగా కేసులు నమోదు చేయించి ఆట కట్టించారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగ్గొట్టడం వెనుక ప్రకాశం జిల్లాలోని భూగర్భ గనుల శాఖ (మైనింగ్‌) అధికారుల పాత్ర కూడా ఉంది. దాదాపు రాయల్టీ రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఎగ్గొట్టినట్టు విజిలెన్స్‌ లెక్కలను బట్టి అర్థమవుతోంది. 

అక్రమాలకు చెక్‌ పెడతాం
ఎవరైనా గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదు. క్వారీల్లోంచి బయటకు తీసిన ప్రతి రాయి రవాణా చేసేప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి ఏ ఒక్కరైనా గండి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. గ్రానైట్‌ రవాణాపై ఎప్పటికప్పుడు విజిలెన్స్‌ నిఘా ఉంటుంది.
–  కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 

చదవండి: గోదావరి డెల్టాలకు పోల‘వరం’

Advertisement
 
Advertisement
Advertisement