సాధిక్‌కు ఆ కెమికల్‌ ఎక్కడి నుంచి వచ్చింది? | Police investigation into the AE Nukaraju son in law Jagadeeshwar Reddy incident | Sakshi
Sakshi News home page

సాధిక్‌కు ఆ కెమికల్‌ ఎక్కడి నుంచి వచ్చింది?

Aug 27 2026 4:50 AM | Updated on Aug 27 2026 4:50 AM

Police investigation into the AE Nukaraju son in law Jagadeeshwar Reddy incident

సాధి­క్‌

ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర­రెడ్డి హత్యపై పోలీసుల విచారణ    

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పంచాయతీ రాజ్‌ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి హత్యలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తు­న్నారు. సాధిక్‌ ప్రొటీన్‌ పౌడర్‌లో కెమికల్స్‌ కలిపి తన తండ్రికి ఇచ్చాడంటూ జగదీశ్వరరెడ్డి కుమారుడు రియాన్ష్ కార్తికేయ చెప్పడంతో దాని­పై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కెమికల్‌ కేరళ నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని, అది సాధి­క్‌కు చేరేలా హైదరాబాద్‌లోని ఓ బంగారు దుకా­ణం యజమాని సహకరించినట్లు ప్రాథమి­కంగా గుర్తించారు. దీనిని నిగ్గు తేల్చేందుకు పోలీ­సు బృందం హైదరాబాద్‌ వెళ్లింది.నూకరాజు కుటుంబం నుంచి ఆస్తులు లాక్కునేందుకు సాధి­క్‌ ప్రయత్నించాడనే ఆరోపణలపైనా విచారణ జరు­పుతున్నారు.

నూకరాజు కుటుంబం, జగదీ­శ్వరరెడ్డి ఆస్తులకు సంబంధించి రెండేళ్లలో ఏవైనా లావాదేవీలు జరిగాయా.. అవి ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయో తెలుసుకొనేందుకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ అధికా­రులకు పోలీసులు లేఖ రాశారు. సౌజన్య బ్యాంక్‌ ఖాతాలు, పాస్‌ పుస్తకాలను సాధిక్‌ లాక్కున్నా­డనే అంశంపైనా విచారణ సాగుతోంది. సాధిక్‌ తి­మ్మాపు­రం పంచాయతీలో నూకరాజు పేరిట ఉన్న స్థలాన్ని విక్రయించేందుకు సైతం ప్రయ­త్నించాడని ఓ వ్యక్తి వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.

రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు?
సాధిక్‌ ఖాన్‌ను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రి­పో­ర్టులో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలిసింది. సాధిక్‌ మొదటి నుంచీ ఆస్తి కొట్టేయా­లనే ఆలోచనతో ఉండేవాడని పేర్కొన్నట్లు సమాచారం. జగ­దీ­శ్వర్‌రెడ్డి అడ్డు తొలగించుకుని, సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆమె డబ్బు, బంగారం, ఆస్తి తీసు­కో­వాలని అతను పథకం వేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో తెలిపినట్లు సమాచారం. 

జగదీశ్వర్‌­రెడ్డి ఇంటికి వెళ్లిన సాధిక్‌ అతడితో గొడవ పడి, తీవ్రంగా గాయపరిచాడని, అడ్డు వచ్చిన సౌజన్యపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. జగదీశ్వరరెడ్డిని అనేక మార్లు కొట్టినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. జగదీశ్వరరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సమయంలో సాధిక్‌ హైదరాబా­ద్‌లోనే ఉండి సౌజన్యతో ఫోనులో మాట్లాడేవా­డని కాల్‌ డేటా ద్వారా తేలినట్లు సమాచారం.

బయటకొచ్చిన మరో లేఖ..!
నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖలతో పాటు మూడో సూసైడ్‌ నోట్‌ సైతం ఉన్నట్లు సమాచారం. ఆ నోట్‌ నూకరాజు భార్య మీనాదిగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు సూసైడ్‌ నోట్లను ఫోరెన్సిక్, హ్యాండ్‌ రైటింగ్‌ పరీక్షకు పంపినట్లు సమాచారం. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం నిందితుడు షేక్‌ సాధిక్‌ ఖాన్‌ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలంటూ సర్పవరం పోలీసులు కాకినాడ మొబైల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement