డబ్బుల్‌ ధమాకా! | Permanent Secretariat work to be done again by those three institutions at double the cost | Sakshi
Sakshi News home page

డబ్బుల్‌ ధమాకా!

Jun 27 2025 5:38 AM | Updated on Jun 27 2025 11:58 AM

Permanent Secretariat work to be done again by those three institutions at double the cost

శాశ్వత సచివాలయ పనులు రెట్టింపు వ్యయంతో మళ్లీ ఆ మూడు సంస్థలకే

ఇప్పటికే తాత్కాలిక సచివాలయ పేరిట రూ. వందల కోట్లు వ్యయం

ఇప్పుడు దాన్ని వృథా చేస్తూ మరోసారి సచివాలయం పేరిట దోపిడీకి పన్నాగం

మూడే బిడ్లు.. అవే ఖరారు.. పక్కా స్కెచ్‌తో చక్రం తిప్పిన ముఖ్య నేత

మూడు ప్యాకేజీలను ‘సిండికేట్‌’ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి 

చదరపు అడుగుకు ఏకంగా రూ.8,339.12 చొప్పున ధారాదత్తం 

చ.అ. రూ.1,800–2,000కు మించదంటోన్న ఇంజినీరింగ్‌ నిపుణులు

ఇటాలియన్‌ మార్బుల్స్, అంతర్జాతీయ సదుపాయాలతో కట్టినా చ.అ. రూ.4,500కు మించదు 

ఈ ధరతో హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో అందుబాటులో హైరైజ్‌ బిల్డింగ్స్‌ 

టవర్‌–1, 2 పనులను రూ.1,762.81 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీకి కట్టబెట్టిన సర్కార్‌

అక్రమాలకు పాల్పడటంతో ఈ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా

టెండర్లలో పాల్గొనడానికి ఈ సంస్థకు అర్హత లేదు.. అయినా బేఖాతర్‌ 

2018లో ఇవే పనులు ఇదే సంస్థకు రూ.932.46 కోట్లతో అప్పగింత

జీఏడీ టవర్‌ నిర్మాణ పనులను రూ.1,046.07 కోట్లకు ఎన్‌సీసీకి కట్టబెట్టిన ప్రభుత్వం

2018లో ఇవే పనులు రూ.554.06 కోట్లకు ఇదే సంస్థకు అప్పగింత

రూ.1,545.55 కోట్లతో ఎల్‌ అండ్‌ టీకి టవర్‌–3, 4 పనులు

2018లో ఇవే పనులు ఇదే సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగింత

మొత్తంగా 2018తో పోల్చితే రూ.2,083.29 కోట్లు పెరిగిన వ్యయం

అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీలు, నిర్మాణ సామగ్రి, డీజిల్, పెట్రోల్‌ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు

అయినా టెండర్ల దశలోనే పనుల వ్యయం 91.73 శాతం పెంపుపై ఇంజినీరింగ్‌ నిపుణుల విస్మయం

నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇంకెంత అవుతుందో అంటున్న అధికార వర్గాలు

ఇదంతా ‘నీకింత.. నాకింత’ అని పంచుకునే వ్యవహారమేనని చర్చ

సాక్షి, అమరావతి: శాశ్వత సచివాలయం పేరుతో వీలైనంత దోచుకునేందుకు ముఖ్య నేత వేసిన స్కెచ్‌లో ఇంకో అడుగు ముందుకు పడింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ఈ నెల 2వ తేదీన 48వ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఎన్‌సీసీ లిమిటెడ్, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా, డయా గ్రిడ్‌ విధానంలో నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు ఖర్చయ్యే పనులను ఏకంగా చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున కట్టబెట్టింది. ఇటాలియన్‌ మార్బుల్స్‌తో అంతర్జాతీయ సదుపా­యాలతో కట్టినా చదరపు అడుగుకు రూ.4 వేలు–4,500కు మించి ఖర్చు కాదు. 

ఈ ధరతోనే హైదరాబాద్, బెంగళూరు, ముంబయి నగరాల్లో హైరైజ్‌ బిల్డింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాంటిది ఇంతకు రెండింతలు వెచ్చించి నిర్మిస్తుండటంలో ఆంతర్యం ‘నీకింత.. నాకింత..’ అని దోచు­కోవ­డమేనని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తు­న్నారు. టెండర్లలో జీఏడీ భవన నిర్మాణ పను­లకు 4.53 శాతం అధిక ధర రూ.882.47 కోట్లతో కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన ఎన్‌సీసీ.. 1, 2 టవర్‌ పనులకు 4.50 శాతం అధిక ధర రూ.1,487.11 కోట్లతో కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన షాపూర్‌జీ పల్లోంజీ.. 3, 4 టవర్‌ పనులకు 4.54 శాతం అధిక ధర రూ.1,247.22 కోట్లతో కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన ఎల్‌ అండ్‌ టీ సంస్థకు అప్పగించడానికి అనుమతి ఇస్తూ పురపాలక, పట్ట­ణా­భి­వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌­కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల నిర్మాణ వ్యయం రెట్టింపు అవడమే కాకుండా, ఎక్సెస్‌గా ప్రభుత్వ ఖజానాపై రూ.158.62 కోట్ల భారం పడింది. దీంతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి అధిక వడ్డీకి అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లకు దోచి పెడుతూ నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్నారని ఇంజినీరింగ్‌ నిపు­ణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి ఉంటే సగటున 5 శాతం తక్కువ (లెస్‌) ధరకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారని, కనీసం రూ.320 కోట్ల మేర ఖజా­నాకు మిగిలేవని స్పష్టం చేస్తున్నారు. 

ఇక లేహ్‌ విమానాశ్రయం నిర్మాణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థను 2024 ఆగస్టు 22న బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఉత్తర్వులు (ఆర్డర్‌ నెంబరు: ఏఏఐ/లేహ్‌/­ఎన్‌టీబీ/­బ్లాక్‌ లిస్టింగ్‌/2024–25/886) జారీ చేసింది. 2026 ఆగస్టు 21 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంగా పేర్కొంది. అంటే.. అప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఏ టెండర్లలోనూ పాల్గొనేందుకు షాపూర్‌జీ పల్లోంజీకి అర్హత ఉండదు. అయినా సరే ఆ సంస్థ శాశ్వత సచివాలయం టెండర్లలో బిడ్‌ దాఖలు చేసింది.

నిబంధనల ప్రకారం ఆ సంస్థపై అనర్హత వేటు వేయాల్సిన సీఆర్‌డీఏ అధికారులు తద్భిన్నంగా ఆమోదించి పనులు అప్పగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు నాటి టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడూ నిబంధనలను తుంగలో తొక్కి శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను అప్పగించడం వెనుక కమీషన్ల దందా దాగి ఉందని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

మూడు ప్యాకేజీలకూ మూడు సంస్థలే
» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంత­స్తు­లతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివా­లయంలో జీఏడీ ఐకానిక్‌ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. 

»  ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకూ ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేటులోని ఎన్‌సీసీ, ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. 

»  1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన షాపూర్‌జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లతో పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో షాపూర్‌జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

»   3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్‌ చేస్తా­మని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018­లో ఇదే పనులను రూ.784.62 కోట్లతో పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో ఎల్‌ అండ్‌ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.

» జీఏడీ భవన నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1 నిలిచిన ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌­డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు సీఆర్‌డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది.

అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలా..
శాశ్వత సచివాలయ నిర్మా­ణాన్ని 2018లోనూ.. ఇప్పు­డూ డయాగ్రిడ్‌ విధాన­ంలోనే నిర్మించేలా కాంట్రాక్ట­ర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమె­ంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్య­త్యా­సం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. 

నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలకు అప్పగిస్తూ అప్పట్టో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు ఇదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. 

ఐదు భవనాల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పు­న నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా, డయా గ్రిడ్‌ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయా గ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. 

 కానీ.. శాశ్వత సచివాలయం నిర్మాణాన్ని చద­రపు అడుగు రూ.8,339.12 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంపై ఇంజినీర్లు విస్మ­య­ం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపె­డు­తూ.. నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకుతినేలా కుట్ర పన్నడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడు
» తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో అప్పటి సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. 

» ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయ­డం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మా­ణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. 

» ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసి ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement