ఎస్‌వీ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లింపు | Payment of Dues to SV Sugar Factory Workers | Sakshi
Sakshi News home page

ఎస్‌వీ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లింపు

Sep 7 2023 3:43 AM | Updated on Sep 7 2023 3:43 AM

Payment of Dues to SV Sugar Factory Workers - Sakshi

రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా గాజులమండ్యం ఎస్‌వీ సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలను చెల్లించింది. 368 మంది కార్మికులకు 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.21.36 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల విడుదల చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి మంత్రి రోజా.. కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు.

రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో మూసివేశారు. కానీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్మికులు పని కోల్పోయి.. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్య తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 368 మంది కార్మికులకు అందాల్సిన బకాయిలు మొత్తం రూ.21.36 కోట్లను విడుదల చేశారు.

వాటిని బుధవారం మంత్రి రోజా అందజేయగా.. కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య తెలియగానే నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాల్లో సీఎం జగన్‌ వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఎండీ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement