మా అబ్బాయి గాయపడ్డాడు.. వారి​కి నా కృతజ్ఞతలు: పవన్‌ | Pawan Kalyan Emotional Comments Over Mark Shankar Health Condition After Fire Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: మా అబ్బాయి గాయపడ్డాడు.. వారి​కి నా కృతజ్ఞతలు

Apr 9 2025 9:26 AM | Updated on Apr 9 2025 10:44 AM

Pawan Kalyan Emotional Comments Over Mark Shankar

సాక్షి, అమరావతి: సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్లిన తన రెండవ కుమారుడు మార్క్‌ శంకర్‌.. అక్కడ తరగతి గదిలో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని, ప్రాణాపాయమైతే లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ క్రమంలో తాను అరకు పర్యటనలో భాగంగా గిరిజన గ్రామాల సందర్శనలో ఉండగా ప్రమాదం గురించి తన భార్య అన్నా నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందన్నారు. ఆ తర్వాత ఇక్కడ (హైదరాబాద్‌)కు వచ్చానన్నారు. ప్రమాదం చిన్నదే అని తొలుత భావించానని, అయితే ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలవ్వడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రమాదంలో చిన్నారి మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్లపై గాయాలయ్యాయని, ఆ సమయంలో దట్టమైన పొగ పీల్చడంతో అది ఊపిరితిత్తుల్లోకి చేరినట్టు వైద్యులు తెలిపారన్నారు. దాని నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్రాంకోస్కోపీ జరుగుతోందని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు స్పష్టం చేశారని చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తొలుత గుర్తించి, పిల్లలను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారు వెంటనే స్పందించడం వల్ల చాలా మంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగారన్నారు.

‘పిల్లలు తరగతి గదులకు వెళ్లి సురక్షితంగా తిరిగి వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఏడేళ్ల మార్క్‌ శంకర్‌కు ప్రమాదంలో చిన్న గాయాలు అయినప్పటికీ, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ రోజు నా పెద్ద కుమారుడు అకీరానందన్‌ పుట్టిన రోజు. దురదృష్టవశాత్తు ఈ రోజు నా చిన్న కుమారుడికి గాయాలు అవడం బాధాకరం. విషయం తెలిసిన వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీ.. మార్క్‌ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వెంటనే సింగపూర్‌లో తగు వైద్య ఏర్పాట్లు చేయాలని భారత హై కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు. అరకులో ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానికి, సీఎంకు ధన్యవాదాలు. ఆపద సమయంలో వెంటనే స్పందించి నిండు మనసుతో మార్క్‌ శంకర్‌ బాగుండాలని అభిలాషించిన రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సహచర సినీ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనసేన శ్రేణులు, ఇతరులందరికీ కృతజ్ఞతలు. ఈ రాత్రి (మంగళవారం)కి కుమారుడి వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను’ అని చెప్పారు. కాగా, ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతికి గురయ్యామని బీజేపీ రాష్ట్ర «అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement