సాక్షి, పల్నాడు: జిల్లాలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన తుఫాను (SUV) వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ బంధువులు మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో తుఫాను వాహనంలో పది మందికి పైగానే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల్ని కదిరి వెంకటేశ్వర్లు ,కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా పోలీసులు ప్రకటించారు.
ప్రమాదానికి అతివేగం కారణమా, లేక డ్రైవర్కు నిద్రమత్తు వచ్చిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒక విషాదంలో.. ఒక్కసారిగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మరో విషాదం చోటు చేసుకోగా వాళ్ల స్వస్థలాల్లో శోకసంద్రం అలుముకుంది.


