జాతీయ స్థాయిలో ఏపీ పరువు గోవింద! | National Games: AP Olympic Association and AP Sports Authority Clash | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో ఏపీ పరువు గోవింద!

Jan 31 2025 5:12 AM | Updated on Jan 31 2025 5:12 AM

National Games: AP Olympic Association and AP Sports Authority Clash

రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, శాప్‌ లోగోలు లేకుండా మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్న క్రీడాకారులు

జాతీయ క్రీడల సాక్షిగా శాప్‌ వర్సెస్‌ ఏపీవోఏ

రెండు గ్రూపులుగా పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారులు

విజయవాడ స్పోర్ట్స్‌: ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఏపీవోఏ), ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఏపీ–శాప్‌) మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. వెరసి రాష్ట్ర క్రీడాకారులకు 38వ జాతీయ క్రీడలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రడూన్‌లో ప్రారంభమైన ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లిన క్రీడాకారులు, కోచ్, మేనేజర్‌లు పడరాని పాట్లు పడుతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 21 క్రీడాంశాలు అర్హత సాధించాయి.

వీటిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, జూడో, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, మోడ్రన్‌ పెంటాథ్లాన్, షూటింగ్, కానోయింగ్‌ కాయాకింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు, మాల్కాంబ్‌ జట్లు శాప్‌ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ట్రాక్‌షూట్‌లు, షూ, టీఏ, డీఏ, కిట్, కోచింగ్‌ క్యాంపులకు నగదును శాప్‌ సమకూర్చింది. మిగిలిన ట్రైథ్లాన్, యోగాసన, సైక్లింగ్, బీచ్‌ హ్యాండ్‌బాల్‌ జట్లు ఏపీవోఏ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ఏపీవోఏ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం ట్రాక్‌షూట్, షూ సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరిగిన మార్చ్‌ఫాస్ట్‌లో రాష్ట్రం నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

వీరిలో కొందరు ధరించిన ట్రాక్‌ షూట్‌లలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, శాప్‌ లోగో లేకపోవడం నిర్వాహకులు, జాతీయ మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.  ర్యాలీలోనూ ఏపీవోఏ ప్రతినిధులు కేవలం ఏపీవోఏ పేరుతో ఉన్న ఫ్లకార్డులు, బ్యానర్‌లనే మైదానంలో ప్రదర్శించారు. ఇదిలా ఉండగా ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ) నిర్వహించే ఈ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారుల వసతి సౌకర్యాలు ఏపీవోఏ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర క్రీడాకారులకు ఐవోఏ కేటాయించిన గదుల్లోకి శాప్‌ ఆధ్వర్యంలో వెళ్లిన క్రీడాకారులు, మేనేజర్, కోచ్‌లను ఏపీవోఏ కొన్ని గంటల పాటు అనుమతించక పోవడం కలకలం రేపింది. 

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా?
హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర క్రీడాకారులను ఆర్‌.కె.పురుషోత్తం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. 21 క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు ట్రాక్‌షూట్, షూ, టీఏ, డీఏ, కిట్‌ సమకూర్చేందుకు శాప్‌ రూ.75 లక్షలను సిద్ధంగా ఉంచినా, రాష్ట్ర పరువు గంగలో కలవడం బాధాకరం. – యలమంచిలి శ్రీకాంత్, ఏపీ కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement