45,000 ఎకరాల్లో.. 67 పారిశ్రామిక పార్కులు

Mekapati Goutham Reddy And RK Roja Talks To Media On New Industrial Policy - Sakshi

పాలసీలో ప్రతి అంశాన్నీ నెరవేరుస్తాం: మంత్రి మేకపాటి

ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించారు : ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌కే రోజా  

గత సర్కారు బకాయిపడ్డ రూ.4,000 కోట్ల రాయితీలు చెల్లిస్తున్నాం 

వారం రోజుల్లో ఐటీ–ఎలక్ట్రానిక్‌ పాలసీ విడుదల  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తెచ్చినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్టుబడి వ్యయం చాలా తక్కువయ్యేలా శ్రీసిటీ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 67 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలిపారు. 45,000 ఎకరాల్లో ఈ పార్కులను అంతర్జాతీయ వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. సోమవారం 2020–23 పారిశ్రామిక పాలసీ విడుదల చేసిన తర్వాత మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించాం. 
► వైఎస్సార్‌ వన్‌ ద్వారా పరిశ్రమలకు జీవితకాలం రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఈ పాలసీలో పేర్కొన్న ప్రతీ అంశాన్ని నెరవేరుస్తాం.
► గత సర్కారు పరిశ్రమలకు రూ.4,000 కోట్ల రాయితీలు బకాయి పెడితే మా ప్రభుత్వం తీరుస్తోంది. 
► నూతన పాలసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాం.
► రాష్ట్రానికి వచ్చిన ప్రతీ పెట్టుబడి ప్రతిపాదన వాస్తవరూపం దాల్చేలా కృషి చేస్తాం.
► మరో వారం రోజుల్లో ఐటీ–ఎలక్ట్రానిక్స్‌ పాలసీని విడుదల చేస్తాం.

సీఎం మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించారు
► మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి మహిళా పక్షపాతినని నిరూపించుకున్నారు. 
► ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించి ఇది చేతల ప్రభుత్వమని రుజువు చేసుకుంది.
► గతంలో పారిశ్రామిక పాలసీ రియల్‌ ఎస్టేట్‌ పాలసీ మాదిరిగా ఉంటే ఇప్పుడది రియల్‌ పాలసీలా ఉంది. నిజమైన పరిశ్రమలకు రాయితీలు లభించేలా పాలసీని రూపొందించారు.     
– రోజా, ఏపీఐఐసీ చైర్మన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top