ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు | Sakshi
Sakshi News home page

ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు

Published Sun, May 16 2021 1:09 PM

Medical Tests For Raghu Rama Krishnam Raju In Guntur GGH - Sakshi

సాక్షి, గుంటూరు: జీజీహెచ్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య  వైద్య నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నివేదికను హైకోర్టుకు వైద్య నిపుణుల కమిటీ సమర్పించనుంది. నివేదికలో ఏముంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ ముందుకు సాగనుంది.

కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.

ఇది ఇలా ఉండగా, ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 వరకు రిమాండ్‌కు  కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనను జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్‌ కోర్టులో హాజరుపర్చారు.  సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్‌ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. రఘురామ అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

చదవండి: ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు?
రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి

Advertisement
Advertisement