
శ్రీకాకుళం: కోటబొమ్మాళిలో బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్న మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిపురం లక్ష్మి (30) తన భర్త తిరుపతిరావుతో కలిసి కోటబొమ్మాళి విద్యుత్నగర్లో నివాసముంటోంది. లక్ష్మి స్థానికంగా హర్షిణి పేరుతో బ్యూటీ పార్లర్, లేడీస్ కార్నర్ నిర్వహిస్తోంది.
తిరుపతిరావు కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో పలుమార్లు పోలీస్స్టేషన్కు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భార్య లక్ష్మిని భర్త తిరుపతిరావు దారుణంగా గొంతు కోశాడు. దీంతో లక్ష్మి తీవ్ర రక్తస్రావంతో విగత జీవిగా పడిపోయింది. అనంతరం తిరుపతిరావు మద్యం షాపునకు వెళ్లిపోయాడు.
సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మద్యం షాపు వద్ద ఉన్న తిరుపతిరావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇన్చార్జి సీఐ విజయకుమార్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు.