మార్కాపురం: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అతికిరాతకంగా నరికి చంపిన సంఘటన మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్విరెడ్డిపల్లెలో బుధవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గిద్దలూరుకు చెందిన పెయింటర్ పన్నీటి దావీదుకు సర్విరెడ్డిపల్లెకు చెందిన చిన్నప్ప కుమార్తె జ్యోతితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్ల క్రితం జ్యోతి పుట్టింటికి వచ్చింది.
డ్వాక్రా వీఓఏగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. దావీదు నెలలో ఒకటి రెండుసార్లు సర్విరెడ్డిపల్లె వచ్చి పిల్లలను చూసుకుని వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే జ్యోతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో చుట్టుపక్కల ప్రాంతంలో దాక్కుని ఉన్న దావీదు సంచిలో తెచ్చుకున్న గొడ్డలి తీసి భార్యను నరికేందుకు ప్రయతి్నంచాడు. జ్యోతి సోదరి గొడ్డలి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పక్కకు నెట్టేసి జ్యోతి తలపై నరికాడు.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు, గిద్దలూరు సీఐ రామకోటయ్య పరిశీలించారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


