జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు.
జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్ అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మీరు నిజమైన రైతులేనా!


