ఆర్టీసీ బస్సును అడ్డుకుని ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న గుడిబండ మండలం కరికెర మహిళలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. గుక్కెడు నీళ్లివ్వండి మహాప్రభో అంటూ పాలకులను వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం గాండ్లపెంట, గుడిబండ, కుందుర్పి మండలాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. – గాండ్లపెంట/ గుడిబండ/కుందుర్పి
⇒ తాగడానికి బిందెడు మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశి్నస్తూ అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పిలేపల్లికి చెందిన మహిళలు సోమవారం ఉదయం ఆరు గంటలకే ఖాళీ బిందెలతో కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను సుమారు నాలుగు గంటల పాటు అడ్డుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదిలేదని స్పష్టం చేశారు. చివరకు పోలీసులు, మండల పరిషత్ అధికారులు వచి్చ.. వారం రోజుల్లోగా కొత్తగా బోరు వేయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
⇒ శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి గొల్లపల్లిలో రెండు నెలలుగా తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సోమవారం ఉదయం కటారుపల్లి క్రాస్కు చేరుకుని కదిరి–రాయచోటి ప్రధాన రహదారిపై బైఠాయించారు. వాడకానికి సైతం గ్రామంలో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయించి తెచ్చుకుంటున్నామని, తాగునీటిని కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. ]
ఆందోళన విషయం తెలుసుకున్న ఎంపీడీఓ రామక్రిష్ణ, ఎస్ఐ సుమతి అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కిరణ్కుమార్రెడ్డిని ఎంపీడీఓ ఆదేశించారు. పంచాయతీ బోరులో అదనపు పైపులు అమర్చి సమస్య పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
⇒ గుడిబండ మండలం కరికెర గ్రామ మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో నాగేపల్లి –కరికెర రహదారిపై నిరసన తెలిపారు. 20 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, గుక్కెడు నీరు లేక నీరసించిపోతున్నామని వివరించారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే యంత్రాంగం స్పందించకపోతే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


