
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ చౌదరి చేసిన వ్యాఖ్యలను అమరావతి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి అంజిబాబు గురువారం ఖండించారు. ముద్రగడపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
అశ్వనీదత్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడను వాడు, వీడు అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టారు. కుల అహంకారంతో ముద్రగడను దూషించిన అశ్వనీదత్కు కాపుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాపులది పిచ్చి ఉద్యమమని వ్యాఖ్యానించి.. కాపు జాతిని అవమానించారని మండిపడ్డారు.