
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్కు బెయిల్ మంజూరైంది. వరప్రసాద్ సహా 13 మందికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదుతో వారిని పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.
వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ జెండాలు, తోరణాలను వైఎస్సార్ విగ్రహం వద్ద తొలగించారు. అయితే, వాటిని తొలగించినందుకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు అత్యుత్సాహంతో హత్యాయత్నం కేసును వైఎస్సార్సీపీ నాయకులపై నమోదు చేసిన విషయం తెలిసిందే.
అధికార పార్టీ అండదండలతో తమను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారంటూ వైఎస్సార్సీపీ నాయకులు జడ్జికి వివరించారు. అరెస్టయిన వారితో పాటు కేసులో ఉన్న ఇతరులకు కూడా కడప జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి పులివెందులలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి.