
ఉద్యోగ అవకాశం కోసం నగదు, సర్టిఫికెట్లతో హాజరైన నిరుద్యోగులు
రాజధాని కేంద్రంగా జనసేన నాయకుని దందా
తాడేపల్లి రూరల్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజధాని ముఖద్వారం ఉండవల్లి కేంద్రంగా దాదాపు 200 మంది నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధపడిన ఒక జనసేన నాయకుని ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టిన వైనమిది. సేకరించిన వివరాల ప్రకారం, విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో పార్కింగ్ ఫీజు వసూలు చేసే శివ అనే ఒక జనసేన నాయకుడు ఉండవల్లిలోని మూడు బొమ్మల సెంటర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రాష్ట్రంలోని దేవదాయ శాఖ, పౌరసరఫరాల శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఎటువంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపీతో, మంత్రితో మాట్లాడి ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా తమ నాయకులు, కార్యకర్తలతో గడచిన కొంత కాలంగా ప్రచారం నిర్వహించాడు.
ఈ ప్రచారం మేరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. వీరి నుంచి రూ.10 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ వసూళ్ల దందా ప్రణాళికను సిద్ధం చేసుకున్న నిందితుడు నిరుద్యోగుల నుంచి నగదు, సర్టిఫికెట్లు సేకరించడానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమాయత్తం అవుతుండగా, మీడియా రాకతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
అయితే ‘తగ్గేదేలే..’ అన్నట్లు ఎంపీ, మంత్రులు తన వెనుక ఉన్నారంటూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడంతో, ఉద్యోగాలు ఇవ్వడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నానని ఒప్పుకున్నాడు. డిగ్రీలు చదివి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఎలా నమ్మారంటూ నిరుద్యోగులను ప్రశ్నించగా, ఎంపీ బాలశౌరి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్ తనకు తెలుసని, వారి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితుడు చెప్పినట్లు అక్కడివారు తెలిపారు. ఇంకా ఎవ్వరూ డబ్బులు చెల్లించలేదని కూడా వారు పేర్కొనడం గమనార్హం.