సాక్షి ప్రతినిధి, విజయనగరం: చాలా కుటుంబాల్లో పిల్లలు పుట్టినప్పుడు కొద్దిరోజుల్లో వారి జాతక చక్రాలు వేయించే ఆచారం ఉంది. వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది.. మున్ముందు బిడ్డ నడవడిక ఎలా ఉంటుంది.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తాడా? లేదా?.. ఇలా రకరకాలుగా పరిశీలన చేస్తారు. కొందరైతే బిడ్డ ఏదైనా గండంమీద పుట్టాడా అనేది కూడా చూస్తారు.. అంటే తల్లి గండం.. తండ్రి గండం.. మేనమామ గండం.. ఇలా అన్నమాట... ఇదే క్రమంలో విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్యేలకు కూడా బోలెడు గండాలున్నట్లు జాతక చక్రాలు చెబుతున్నాయి.
వీళ్లందరికీ ఆయా కుటుంబీకులే పెద్ద గండాలుగా తయారై వారి పదవికి గండం తెచ్చేలా ఉందని రాజకీయ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా తేల్చి చెప్పారు. మొన్నటి మీటింగ్లో ఎవరెవరికి ఏయే గండాలు పొంచి ఉన్నదీ విడమర్చి చెప్పారు. ఆ గండాలే ఇప్పుడు వారిపాలిట సుడిగుండాలు అయ్యాయి. వీటిలో నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యేలు ఈదులాడుతున్నారు. ప్రజలకు మేలు చేయకపోయినా ఫరవాలేదు.. పదవికి మచ్చతేవద్దంటూ దండాలు పెడుతున్నారు.
నెల్లిమర్లలో ఎమ్మెల్యే భర్త రుబాబు
తొలిసారి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీమంతురాలు లోకం నాగమాధవి గెలుస్తూనే ఊళ్లమీదపడి దందాలు మొదలెట్టారన్నది ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట. ఎకరాల నుంచి నాలుగైదు సెంట్ల భూమి సైతం కొనడంతో పాటు ఇరుగుపొరుగు రైతులను బెదిరించడం సర్వసాధారణమైందట. దీనికి తోడు ఆమె భర్త లోకం ప్రసాద్ ఆమె పాలిట గుదిబండగా మారారు. ఆమె ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే.. నేను ఆమెకు మొగుడిని.. కాబట్టి నాకే ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులపై రుబాబు చూపిస్తున్నారు.
దీనికితోడు బినామీ ఒకరిని పెట్టుకుని కాంట్రాక్టు పనులన్నీ ఆయనతోనే చేయించుకుంటూ అందులో కూడా ఆదాయం తమ ఖాతాకు వచ్చేలా చూసుకుంటున్నారు. పార్టీకోసం పనిచేసిన జనసేన కార్యకర్తలు, టీడీపీ వారి పరిస్థితి శ్మశానం ముందు నక్కలమాదిరిగా తయారైంది. ఎక్కడైనా ఏదో ఎముక దొరక్కపోదా అనేలా ఉంది వారి పరిస్థితి.. దీంతో భర్తగండంతో కొట్టుమిట్టాడుతున్న ఈమెకు కూడా సీఎం చంద్రబాబు నుంచి చీవాట్లు తప్పలేదట.


