ఏలూరు జిల్లా: కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజును వేడుకగా చేసుకున్న ఆనందం మరువక ముందే ఆ చిన్నారిని పాము రూపంలో మృత్యువు కబళించింది. మంచంపై తల్లితో నిద్రిస్తున్న ఆ బాలిక పాముకాటుకు గురై మృతి చెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోనపాపపేట మత్స్యకార కుటుంబానికి చెందిన చప్పా దీపిక (13) తల్లి మల్లీశ్వరితో గురువారం జన్మదిన వేడుక జరిగింది. ఆ రాత్రి తన ఇంటిలో నిద్రిస్తోంది.
అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2.30 సమయంలో ఏదో కుట్టినట్టు అనిపించి తల్లికి చెప్పింది. ఏ ఎలకో కరచి ఉంటుందని భావించి ఉదయం ఇంజెక్షన్ చేయిస్తామని నచ్చచెప్పి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇబ్బందిగా ఉందని మరోసారి తల్లిని లేపింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి సమీపంలోని బంధువులకు విషయం చెప్పి చికిత్స కోసం 108కి సమాచారం ఇచ్చారు. ఆ వాహనం వచ్చేలోపే బాలిక నోటి వెంట నురగ రావడంతో చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా చికిత్స నిమిత్తం ఆధార్ కార్డు కావలసివచ్చి దీపిక పడుకున్న మంచం పరుపుకింద వెతకగా ఆ పక్కనే తాచుపాము బుసకొడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అంతలోనే తేరుకుని దానిని హతమార్చారు. దీపిక స్థానిక జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్సై వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


