వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు | AP High Court Seeks Explanation From Centre, State, And Meta Over Suspension Of YSRCP Official Facebook Page | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

Jun 19 2026 11:49 AM | Updated on Jun 19 2026 11:58 AM

High Court Responds To YSRCP Petition

ఫేస్‌బుక్‌ ఖాతా నిలిపివేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెటాకు నోటీసులు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా బ్లాక్‌ చేయించడంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మెటా సంస్థను ఆదేశించింది. వారికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

తమ పార్టీ అధికార ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఏకపక్షంగా బ్లాక్‌ చేశారని తెలిపారు. ఎవరు ఆదేశిస్తే బ్లాక్‌ చేశారో చెప్పడం లేదన్నారు. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో మెటా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన వివరించారు. ఐటీ చట్ట నిబంధనలను కాలరాసిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఆగస్ట్‌ 13కు వాయిదా వేసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement