సాక్షి, అల్లూరి: ఏపీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జీఓ నంబర్-3ను పునరుద్ధరించాలనే డిమాండ్లతో ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మన్యం బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేఏసీ నేతలు ఆరోపించారు. వ్యాపారులు బంద్కు సహకరించకుండా పోలీసులు, అధికారులు సంప్రదింపులు జరిపారని, షాపులను యథావిధిగా తెరవాలని ఆదేశాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు. అయితే బంద్కు సహకరిస్తామని పలువురు వ్యాపారులు, వర్తకులు స్పష్టం చేసినట్లు తెలిపారు.
జీఓ నంబర్-3ను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అల్లూరి జిల్లాను జోన్-1లో కొనసాగించాలని కోరారు. అలాగే 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు నిలిపివేయడంతో పాటు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరారు. ఏజెన్సీ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారని జేఏసీ నేతలు తెలిపారు. పోలీసు బలగాలను భారీగా మోహరించి బంద్ను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు.


