మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు | Heavy rain likely in Andhra Pradesh for next three days | Sakshi
Sakshi News home page

మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు

May 5 2025 4:53 AM | Updated on May 5 2025 10:51 AM

Heavy rain likely in Andhra Pradesh for next three days

కొనసాగుతున్న ద్రోణి 

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్‌ తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా తీరం మీదుగా కోస్తాంధ్ర వరకూ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది  సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు­న్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.

గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గరిష్టంగా 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. దక్షిణకోస్తా జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 50 నుంచి 60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీప వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.

కాకినాడ జిల్లా కాజులూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఆదివారం నంద్యాల జిల్లా గోనవరం, నెల్లూరు జిల్లా సోమశిల, తిరుపతి జిల్లా వెంకటగిరి, వైఎస్సార్‌ జిల్లా కమలాపురం తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. మరో రెండు రోజులు  రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.

పశ్చిమ విఘ్నాల వల్లే..
రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి వాతావరణానికి వెస్ట్రన్‌ డిస్టర్బెన్స్‌ (పశ్చిమ విఘ్నాలు) కార ణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని కారణంగా ప్రస్తుతం రెండు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. ఇవి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వ్యాప్తంగా విస్తరించి ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయి. భూమి నుంచి మూడు కిలోమీటర్ల పైకి వెళ్లే వరకూ వెస్ట్రన్‌ డిస్టర్బెన్స్‌ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వీచే గాలులు సముద్రం నుండి ఎక్కువ శాతం తేమను తీసుకుని అప్పటికప్పుడు మేఘాలుగా ఏర్పడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement