సాక్షి,వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందుల పర్యటనలో అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం ఆయన పర్యటన అడుగడుగునా అభిమానుల కేరింతలు, కోలాహలం మధ్య సాగింది. జనం భారీగా తరలిరావడంతో ఆయన పర్యటన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా నడిచింది.
వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు భూమయ్యగారిపల్లె చేరుకున్నారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఇటీవల మృతిచెందిన భూమయ్యగారిపల్లె మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
భూమయ్యగారిపల్లె నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులివెందులకు వైఎస్ జగన్ బయలుదేరగా, దారిపొడవునా అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభిమానుల తాకిడి కారణంగా మధ్యాహ్నం 12 గంటలకే పులివెందుల చేరుకోవాల్సిన ఆయన వాహనం, సాయంత్రం 4:30 గంటలకు కానీ అక్కడికి చేరుకోలేకపోయింది.
దారిలో ప్రతి ఒక్కరి వద్ద ఆగుతూ, అందరినీ పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. కుర్రాళ్ళు ఆయన వాహనం వెంట నడవగా, సెల్ఫీల కోసం యువత ఉర్రూతలూగారు. ప్రతి ఒక్కరికీ సెల్ఫీలు ఇస్తూ ఆయన ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో బాకరాపేటలో ఒక చిన్నారికి వైఎస్ జగన్ స్వయంగా ఓనమాలు దిద్దించి, అక్షరాభ్యాసం చేయించారు.
సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడ ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన వ్యక్తిగతంగా కలిశారు. వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారి నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.


