పేదల ఇళ్లకు పెద్దపీట | The government gives the highest priority to the construction of houses for the poor | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లకు పెద్దపీట

Jun 2 2024 5:56 AM | Updated on Jun 2 2024 5:56 AM

The government gives the highest priority to the construction of houses for the poor

రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు వెల్లడి

30.20 లక్షల ఇళ్ల పట్టాలను ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం

17,005 లేఔట్లలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం 

తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి 

గ్రామీణ పేదల గృహ నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలివ్వాలి

2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత 

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 2024–25 రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున 30.20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు మహిళల పేరిట ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలను కూడా చేపట్టిందని నాబార్డు ప్రముఖంగా ప్రస్తావించింది. 

గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించింది. 17,005 లేఔట్లలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మూడు దశల్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని తెలిపింది.

పేదల ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన మెటీరియల్‌ను తక్కువ ధరకే సమకూర్చడంతోపాటు కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని నాబార్డు పేర్కొంది. 2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత ఉందని జిల్లాల వారీగా రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement