తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని అన్నారు. సెటిల్మెంట్లు, మద్యం, ఇసుక.. అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
‘‘రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా తమ నాయకుడి ఇంటిమీదకే వెళ్లి దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి, దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు’’ అని చెప్పారు.
అతని మీద 94 కేసులు
మందేసి, చిందేసిన ఎమ్మెల్యే చింతమనేనికి పోలీసులు మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘‘దీన్ని జంగిల్ రాజ్ అనరా? చికెన్ మీద కూడా ట్యాక్సులు వేసి దోచుకునే దుస్థితికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. మా ఇంటి మీద దాడి చేసిన వారిని వదిలేసి నాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉంది. చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద వదిలేశారు.
ఇప్పటికే అతని మీద 94 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు? దీనికి కూటమి నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. తమ దోపిడీకి ఎవరు అడ్డొస్తే వారిపై దాడి చేస్తున్నారు. లాకప్ డెత్ లు గతంలో విన్నాం. ఇప్పుడు ఆ శవాలను కూడా పోలీసులు దహనం చేసే పరిస్థితికి వచ్చింది. పోలీసులే రౌడీలుగా మారతారా? అసలు ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారు? హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు?

లింగమనేని రమేష్ ఫ్లైట్ టిక్కెట్లు కొనటంతో జనసేన నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటో? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు ఎందుకు? పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం హాస్యాస్పదం. రిలీజ్ అయిన సినిమాని రీరిలీజ్ చేసినట్టుగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు కదా? ఇంకా జాతీయ రాజకీయాలు అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. రాష్ట్రం కోసం త్యాగం చేశానంటున్న పవన్ రానున్న రోజుల్లో జనసేనని టీడీపీకి త్యాగం చేస్తారేమో?’’ అని నిలదీశారు.


