Flood Water Updates In AP: పొంగిన మున్నేరు వాగు.. కంచికచర్ల-చెవిటికల్లు మధ్య రాక పోకలు బంద్
సాక్షి, ఎన్టీఆర్\కృష్ణా జిల్లా: భారీ వర్షాలతో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కంచికచర్ల-చెవిటికల్లు రహదారిపై వరద ప్రవాహం కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
భారీ వర్షానికి మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పేర్ని నాని పర్యటించారు. డ్రైవర్ కాలనీ, గుమస్తాల కాలనీ, సుందరయ్య నగర్ను పరిశీలించారు. వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 10.20 అడుగులకు నీటిమట్టం చేరింది. 7.67 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.