
తిరుమలలో భక్తుల ఆందోళన
క్యూలైన్లో ‘చైర్మన్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు
తిరుమల: తిరుమల శ్రీవారి క్యూలైన్లో శుక్రవారం రాత్రి భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్.. ఈవో డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గత 20 రోజులుగా క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి బయటకు వస్తోంది. అయితే టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుల సూచనల మేరకు గత 15 రోజులుగా టీటీడీ ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను స్వీకరిస్తూ వస్తోంది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పేరుకు బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు తెచ్చినా, సర్వదర్శనం ప్రారంభం అయ్యేందుకు దాదాపు మధ్యాహ్నం 12 గంటలు అవుతోంది. క్యూలైన్లో సైతం సరైన సదుపాయాలు కల్పించడం లేదనే వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.
అయితే దీన్ని పాత వీడియో అంటారనే ఉద్దేశంతో సమయం, స్థలం, తేదీతో సహా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ అందిస్తున్న సేవలు దారుణంగా ఉన్నాయని భక్తులు ఆ వీడియోలో విమర్శిస్తున్నారు. సామాన్య భక్తుల వ్యధ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.