పర్యాటకంలో ‘పీపీపీ’ | Sakshi
Sakshi News home page

పర్యాటకంలో ‘పీపీపీ’

Published Thu, Jan 11 2024 5:32 AM

Development of eco and adventure tourism in Gandikota - Sakshi

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లోని అపార పర్యాటక వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు  ఏపీ ప్రభుత్వం పీపీపీ విధానానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా పర్యాటక సామర్థ్యం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా సర్వే చేసింది. వీటిల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పర్యాటక సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత అడ్వెంచర్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో పర్యాటక అనుభూతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రఖ్యాత హోటల్‌ రంగ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నది.

‘అడ్వెంచర్‌’కు కేరాఫ్‌ గండికోట
వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట ప్రాంతాన్ని ఎకో, అడ్వెంచర్‌ టూరిజానికి చిరునామాగా మార్చేందుకు ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలిచే గండికోటలో ఇప్పటికే అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎర్రమల కొండలను చీలుస్తూ వేగంగా ప్రవహించే పెన్నానదిలో బోటింగ్‌ సౌకర్యాలను మెరుగుపర్చనుంది. వీటితో పాటు అంతర్జాతీయ హోటల్‌ రంగ సంస్థ  ఒబెరాయ్‌ త్వరలో ఏడు నక్షత్రాల హోటల్‌ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. 

కృష్ణానదిపై ‘రోప్‌ వే’
విజయవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ప్రాజెక్టును ప్రతిపాదించింది. విజయవాడలోని బెరంపార్కు నుంచి భవానీద్విపంలోకి కృష్ణా నదిపై 1.2 కిలోమీటర్ల ఏరియల్‌ పాసింజర్‌ రోప్‌వేను నిర్మించనుంది. దీంతో రాష్ట్రంలో ఆరుచోట్ల పాటు సీప్లేన్, మరో ఫైవ్‌స్టార్‌హోటల్‌ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కన్వెక్షన్‌ సెంటర్‌తో కూడిన హోటల్‌ నిర్మాణం, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం బీచ్‌లో హోటల్‌ సౌకర్యంతో కూడిన బీ­చ్‌ రిసార్టు, నంద్యాల జిల్లాలో వెల్‌నెస్‌ టూరిజం, వేసైడ్‌ ఎమినిటీస్‌ కల్పనకు టెండర్లు ఆహ్వానించింది.

Advertisement
Advertisement