దేవాన్ష్ ఘాట్గా నామకరణం చేసి పెట్టిన బోర్డు
మునికూడలి ఘాట్కు 2015 పుష్కరాల్లోనే దేవాన్ష్ పేరు
ఎమ్మెల్యే బత్తుల అత్యుత్సాహంతో ప్రస్తుతం వ్యవహారం వెలుగులోకి
టీడీపీ నేతల తీరుపై భక్తులు, హిందు ధార్మీక సంస్థల ఆగ్రహం
సీతానగరం: తూర్పు గోదావరి జిల్లా మునికూడలిలోని శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘాట్కు అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనమడు దేవాన్ష్ పేరును పెట్టిన వ్యవహారం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ను ప్రసన్నం చేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చూపిన అత్యుత్సాహంతో తాజాగా వెలుగుచూసిన ఈ వ్యవహారంపై హిందూ ధార్మీక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పవిత్ర ఘాట్లకు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం సరికాదని భక్తులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆధ్యాతి్మక, చారిత్రక వారసత్వానికి నిలయమైన గోదావరి తీరంలోని మునికూడలిలో దశాబ్దాలుగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ‘శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘట్టం’ 1979 పుష్కరాల సమయంలో ఏర్పాటయ్యింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ ఘాట్కు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో నామకరణం చేసి ‘దేవాన్ష్’ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు.
అయితే రానున్న పుష్కరాల నేపథ్యంలో ఎమ్మెల్యే బత్తుల ఘాట్ను సందర్శించారు. దేవాన్ష్ ఘాట్ను ఆదర్శంగా, ఒక మోడల్గా అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారని, కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సర్వత్రా తీవ్ర చర్చ, విమర్శలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అయి.. వివాదాస్పదం కావడంతో లోకేశ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించారు. ఘాట్కు దేవాన్ష్ పేరు ఉంటే తక్షణం తొలగించాలని ఎక్స్లో పోస్ట్ చేశారు.


