కుదేలవుతున్న కర్షకుడు | Dealers are forcibly foisting bio products upon farmers | Sakshi
Sakshi News home page

కుదేలవుతున్న కర్షకుడు

Jun 18 2026 4:49 AM | Updated on Jun 18 2026 4:49 AM

Dealers are forcibly foisting bio products upon farmers

కంపెనీలు, హోల్‌సేలర్లు, డీలర్లు, అధికారుల మధ్య నలిగిపోతున్న వైనం 

రైతులకు బలవంతంగా బయో ప్రొడెక్ట్స్ ను అంటగడుతున్న డీలర్లు

ఈ అమ్మకాలు ఆపేయాలంటూ వ్యవసాయ శాఖ ఆదేశాలు 

కంపెనీలు, హోల్‌సేలర్స్‌ ఒత్తిడి మేరకే విక్రయిస్తున్నామంటున్న డీలర్లు

ముందు వాళ్లను నిలువరించాలని డిమాండ్‌ 

లేదంటే యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేస్తామని అల్టిమేటం 

ఏమి జరిగినా.. చివరికి ఆరి్థక నష్టం తమకే అంటున్న అన్నదాత

సాక్షి, అమరావతి: పెరిగిన ఖర్చులు, గిట్టుబాటు ధర అందని అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాత.. ఇప్పుడు బయో ప్రొడక్ట్స్  వివాదంలో మరోసారి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు, హోల్‌సేలర్లు, డీలర్లు, అధికారుల మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో రైతే బలిపశువుగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది.ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు రైతును బలవంతం చేయొద్దని డీలర్లకు స్పష్టంచేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలపై డీలర్లు మండిపడుతున్నారు.  

మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండే యూరియా, డీఏపీ కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బయో ప్రొడక్ట్స్  తీసుకోవాలని కంపెనీలు, హోల్‌సేలర్స్‌ తమపై ఒత్తిడి తీసుకొస్తారని, విధిలేని పరిస్థితుల్లోనే వాటిని రైతులకు అవసరం లేకున్నా అంటగట్టాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. తమపై ఇలాంటి ఒత్తిడి వద్దని కంపెనీలు, హోల్‌సేలర్స్‌కు తొలుత స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేస్తామని తేల్చి చెబుతున్నారు.  ఈ వివాదం ఎటు తిరిగినా చివరికి ఆర్థికంగా నష్టపోయేది రైతేనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.  

రైతుల నుంచి రూ.1,000 కోట్లకుపైగా దోపిడీ
» రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 18 లక్షలు, రబీలో 23 లక్షల టన్నుల ఎరువుల వినియోగం ఉంటుంది. కాంప్లెక్స్‌ ఎరువులతో పోలిస్తే కాస్త చౌకగా లభించే యూరియాతో పాటు డీఏపీ ఎరువుల వినియోగం కాస్త ఎక్కువగా ఉంటుంది.  
»  ఇందులో ప్రధానంగా ఖరీఫ్‌లో 7 లక్షల టన్నులు యూరియా, 2.50 లక్షల టన్నులు డీఏపీ, రబీలో 9.38 లక్షల టన్నుల యూరియా, 2.20 లక్షల టన్నుల డీఏపీ ఎరువులు వినియోగిస్తారు. వీటి కోసం సీజన్‌లో ఎనలేని డిమాండ్‌ ఉంటుంది.  
»  ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని సాగులో పెద్దగా అవసరం లేని బయో ఫెర్టిలైజర్లు, బయో స్టిమ్యులెంట్లు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను రైతులకు బలవంతంగా అంట గట్టడం పరిపాటిగా మారింది.  
» యూరియా, డీఏపీ బస్తాలు కొనుగోలు చేసే పరిమాణంలో కనీసం 40–50 శాతం ఈ బయో ప్రొడెక్ట్స్‌ను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తారు. చేసేది లేక చేతిచమురు వదులుతున్నా విధిలేని పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేసి, అవసరం లేకున్నా మోతాదుకు మించి  అన్నదాతలు వినియోగిస్తుంటారు. 
»  ప్రతీ ఏటా ఈ చట్ట వ్యతిరేక లింక్‌ ప్రొడెక్ట్స్‌ వ్యాపారం అక్షరాల రూ.1000 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.  
»  ఈ తరహా అమ్మకాలను నిలిపివేయాలన్న రైతుల డిమాండ్‌ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రెండేళ్లుగా ఓ వైపు యూరియా, డీఏపీ అదునుకు దొరక్క రైతులు పడరాని పాట్లు పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణా వ్యవస్థ (ఏపీఏ ఐఎంఎస్‌) యాప్‌ ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టగా, లింక్‌ ప్రొడెక్ట్స్‌ ట్యాగింగ్, అమ్మకాలపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.   
» 100 బస్తాల యూరియా కావాలంటే వాటితో పాటు కనీసం 10 బస్తాల సల్ఫర్, 5 బాక్సుల బయో ప్రొడెక్ట్స్‌ తీసుకోక తప్పని పరిస్థితి కల్పించడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
»  కొన్ని కంపెనీలు తమ డీలర్లకు సబ్సిడీ ఎరువుల కేటాయింపును ఇతర ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానం చేస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.  
» దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై లైసెన్స్‌ రద్దు, క్రిమినల్‌ కేసుల నమోదు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  
» దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.  
» చట్ట వ్యతిరేక బలవంతపు విక్రయాలకు పాల్పడే వారిపై సంబంధిత వ్యవసాయ అధికారి, ఎరువుల ఇన్‌స్పెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి లేదా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ ఆదేశాలు ఇచ్చారు.  

కంపెనీలు, హోల్‌సేలర్లకు కూడా ఆదేశాలు ఇవ్వండి 
యూరియా, డీఏపీతో పాటు లింక్‌ ప్రొడెక్ట్స్‌ బలవంతపు విక్రయాలపై వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. బలవంతపు ట్యాగింగ్‌ను ఆపాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం.  అయితే కంపెనీల ఒత్తిడి మేరకే విధిలేని పరిస్థితుల్లో రైతులకు అమ్మాల్సి వస్తోంది. తమపై ఒత్తిడి తెచ్చే ముందు తయారీ దారులు, హోల్‌సేల్‌ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
– వజ్రాల వెంకటనాగిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్ల సంక్షేమ సంఘం 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement