ప్రైవేటుకు ‘హరితా’ర్పణం | Coalition government is putting government assets into private hands | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు ‘హరితా’ర్పణం

May 26 2025 5:24 AM | Updated on May 26 2025 5:24 AM

Coalition government is putting government assets into private hands

పర్యాటక శాఖకు చెందిన హరిత హోటళ్లను ప్రైవేట్‌కి కట్టబెట్టేందుకు కూటమి కుయుక్తులు 

ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో 30 హోటళ్లను అప్పగించేందుకు ప్రతిపాదనలు   

విజయవాడలో గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు 

రోడ్డున పడనున్న 1,000 మందికి పైగా సిబ్బంది

సాక్షి, విశాఖపట్నం: సంపద సృష్టి అంటూ.. ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్‌ చేతుల్లో పెట్టేస్తోంది కూటమి సర్కారు. పర్యాటక శాఖకు ఆదాయం తెచ్చి పెట్టే ఆస్తులేవైనా ఉన్నాయంటే అవి కేవలం హరిత హోటళ్లు మా­త్రమే. రాష్ట్రంలో ఏపీటీడీసీకి ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు ఉన్నాయి. వీటిల్లో 30 హోటళ్లను ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేసి టూరిజం శాఖను నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు పన్నుతోంది.  

విజయవాడలో సమావేశం  
హరిత హోటళ్లను ప్రైవేటు పరంచే సేందుకు  ఈ నెల 23న కొంత మంది స్టేక్‌ హోల్డర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానమందించింది. విజయవాడ బెరంపార్క్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరెవరు వస్తారో ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ ఆదేశించింది. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న వారినే ఈ సమావేశానికి అనుమతిచ్చింది. 

సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ హరిత హోటళ్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏయే హోటల్‌కు ఎంత ఆదాయం వస్తుంటుంది.. ఎక్కడెక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి.. మొదలైన అంశాల గురించి ఏపీటీడీసీ అధికారులు స్టేక్‌ హోల్డర్లకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో హరిత హోటళ్లను ప్రైవేట్‌ పరం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు

ప్రధాన పర్యాటక ప్రాంతాలూ ప్రైవేటుకేనా? 
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటళ్లని తొలి విడతలో ప్రైవేట్‌కు అప్పగించే పని వేగవంతం చేస్తున్న సర్కారు తర్వాత టూరిజంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కూడా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.  ఇప్పటికే ఏయే ప్రాంతాల్ని ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టాలనే దానిపై ఇప్పటికే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి ప్రధాన పర్యాటక ప్రాంతాలు.. వాటి ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను ప్రభు­త్వం ఉన్నపళంగా అడిగి తెప్పించుకుంది. 

వీటిలో ఎంపిక చేసిన వాటిని నెల రోజుల వ్యవధిలోనే ప్రైవేట్‌కు అప్పగించాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇలా ఆదాయాన్ని తెచ్చే హరిత హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్ని మొత్తం ప్రైవేట్‌ పరం చేసేస్తే.. ఏపీటీడీసీ, ఏపీ టూరిజం అథారిటీకి ఆదాయం ఎలా వస్తుందంటూ జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదిస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. 

వీలైనంత త్వరగా.. తాము చెప్పిన సంస్థలకు పర్యాటక ఆస్తుల్ని కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే.. టూరిజం శాఖకు రాష్ట్రంలో ఒక్క హోటల్‌ కూడా లేకుండా పోతుంది. ఇన్నాళ్లూ తక్కువ ఖర్చుతో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ప్రజలపైనా భారం భారీగానే పడనుంది.  

ఉపాధికి గండి 
పర్యాటక శాఖకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టులో 50 నుంచి 60 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, 40 శాతం అవుట్‌ సోర్సింగ్, 10 శాతం మంది రెగ్యులర్‌ ఉద్యోగులుంటారు. ఒక వేళ 30 హోటళ్లని ప్రైవేట్‌కు కట్టబెడితే.. దాదాపు 1000 మందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసి కూడా కేవలం కాసులకు ఆశపడి.. ఉపాధిపొందుతున్న వారి కడుపు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం వెనకాడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement