దుర్గమ్మ సేవలో సీఎం | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో సీఎం

Published Mon, Oct 3 2022 3:33 AM

CM YS Jagan Visits Vijayawada Kanakadurga Temple - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంప్రదాయ పట్టు పంచె, తెల్ల చొక్కా ధరించి ఆలయ దర్శనానికి వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వేద పండితులు, ఆలయ పూజార్లు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు విష్ణు బట్ల శివప్రసాద్‌ శర్మ సీఎం తలకు పరివట్టం (పట్టువస్త్రంతో తలపాగా) చుట్టారు.

దుర్గమ్మకు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ ఈవో భ్రమరాంబకు అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

అనంతరం అమ్మ వారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను వైఎస్‌ జగన్‌ తన తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి అంతరాలయంలోకి వెళ్లి శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో వేద పండితులు సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనం.. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ఎంపీలు నందిగం సురేష్, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కె.అనిల్‌కుమార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement