మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి: సీఎం జగన్‌

Published Mon, Sep 6 2021 12:07 PM

CM YS Jagan Review Meeting Roads And Ports And Airports - Sakshi

సాక్షి, అమరావతి: రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఆర్‌అండ్‌బి, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల కాలం మొదలవుతుంది. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు’’ అని పేర్కొన్నారు.

‘‘మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంది. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

‘‘దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు పచ్చమీడియాతో మనం యుద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాకూడా, నెగెటివ్‌ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే... నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు. మనం బాగుచేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయి’’ అన్నారు సీఎం జగన్‌. (చదవండి: సీఎం జగన్‌ను కలిసిన నటుడు మంచు మనోజ్‌)

రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవండి. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోండి. మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించండి. నివేదికలు ఆధారంగా ఫోకస్‌ పెట్టి వాటిని బాగుచేయండిసంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చుని కార్యాచరణచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. (చదవండి: Andhra Pradesh: చేతల్లో.. సామాజిక న్యాయం)

ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కె వెంకటరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి:
నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు!
టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు 

Advertisement

తప్పక చదవండి

Advertisement