YS Jagan: బీసీలే వెన్నెముక

CM YS Jagan Comments In Jayaho BC Maha Sabha Andhra Pradesh - Sakshi

మూడున్నరేళ్ల పాలనలో ఇదే అంశాన్ని చాటిచెప్పాం

జయహో బీసీ మహాసభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌

బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే అధికంగా అమలు చేశాం

ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా, విద్యా సాధికారత సాధించే దిశగా అడుగులు వేశాం

డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా బీసీలకు రూ.1.63 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చాం.. కేవలం డీబీటీ రూపంలోనే నేరుగా బీసీల ఖాతాల్లో రూ.86 వేల కోట్లు

మంత్రివర్గం నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే 

వివిధ పదవులకు ఎన్నికై ఇక్కడికొచ్చిన 85 వేల మందే రాజకీయ సాధికారతకు నిదర్శనం.. ఆసరా, చేయూతతో మహిళా సాధికారతకు బాటలు వేశాం

అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా పేదలుగా మిగిలిపోవాలన్నదే బాబు అండ్‌ కో ఉద్దేశం

నా వెంటే ఉన్న మీ అందరినీ అన్ని విధాలా అందలం ఎక్కించాలన్నది నా తాపత్రయం

మహాకవి శ్రీశ్రీ మహా ప్రస్థానంలో చెప్పినట్టు.. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి ఇలా మన సహస్ర గ్రామీణ వృత్తుల సంగమం వేల సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాయం మన బీసీ. నా మనసంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేద వర్గాల వారే. నా ఆచరణ కూడా మీరే. నా వెనకాల ఉన్న ఆ నలుగురూ కూడా మీరే. మీరిచ్చిన అధికారాన్ని మనసుతో మీ కోసం ఉపయోగించే విషయంలో మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ అందరికంటే మిన్నగా ఉంటాడు.

నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు ఇస్తున్న రాష్ట్ర బడ్జెట్‌ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా  అడ్డంగా తిని, బొజ్జలు బాగా పెంచిన దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతున్నాం. ఇదే విషయాన్ని గడప గడప లోనూ చెప్పండి. మనందరి ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగి ఉంటేనే జగనన్నకు తోడుగా నిలవాలని అడగండి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: బీసీలు అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌లని చాటిచెబుతూ మూడున్నరేళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చానని.. ఆ దిశగా ప్రతి అడుగూ వేస్తున్నానని గుర్తు చేశారు. ‘2014 ఎన్నికల్లో బీసీలకు చంద్రబాబు ఏకంగా 114 వాగ్దానాలు ఇచ్చి, అందులో 10 శాతం కూడా అమలు చేయకుండా దగా చేస్తే.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని, నేడు రాజ్యాధికారంలో మేమంతా భాగస్వాములమని ఆ చంద్రబాబుకు చెప్పండి’ అని పిలుపునిచ్చారు.

విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బుధవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహాసభకు వేలాదిగా కదలివచ్చిన బీసీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలో వార్డు మెంబర్‌ మొదలు ఎంపీ వరకు వివిధ పదవులకు ఎన్నికైన దాదాపు 85 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలందరికీ నిండు మనస్సుతో చేతులు జోడించి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న జన సంద్రం మన రాజకీయ సాధికారతకు నిదర్శనం అన్నారు. ‘మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు.. ఇది ఎప్పటికీ మన అనుబంధం’ అని సగర్వంగా తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  
విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభ ప్రాంగణంలో ఓ భాగం  

బీసీలే నాగరికతకు పట్టుకొమ్మలు  
► ఒకనాటి పారిశ్రామిక విప్లవం, ఆధునిక విద్యకు దూరం చేయడం, రాజకీయంగా న్యాయబద్ధమెన వాటా ఇవ్వకపోవడం వల్ల బీసీలు వెనుకబాటుకు గురయ్యారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న నా 139 బీసీ కులాల వారి కష్టాలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా చూశాను.. విన్నాను. వారి ఆశలను, ఆకాంక్షలను తెలుసుకుని, 2019 పిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించాం. ఆ రోజు ఇచ్చిన మాట మేరకు బీసీలను వెన్నెముక కులాలుగా మార్చాను.   

తోకలు కత్తిరిస్తామని చంద్రబాబుకు చెప్పండి 
► బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్‌ కిట్లు, పనిముట్లు కాదని చంద్రబాబుకు చెప్పండి. వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరికీ ఉచిత విద్య, కాలేజీ పిల్లలకు ఐప్యాడ్‌లు, బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఏటా రూ.10 వేల కోట్లు.. ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి.. బీసీలందరికీ నిలువెత్తు ద్రోహం చేసిన ఆ చంద్రబాబు మోసాన్ని గుర్తు చేయండి.  

► మత్స్యకారుల అంతు చూస్తానని, నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్న బెదిరింపులను ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోండి. అయ్యా బాబూ.. మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని.. మీకు మొలిచిన కొమ్ముల్ని, మీకు కొమ్ము కాసేవారిని అందరినీ కత్తిరించే సామాజిక చైతన్యం మాకు ఉందని గట్టిగా చెప్పండి.   

వెన్నెముక కులాలుగా మార్చడమంటే ఇదీ..  
► మీ బిడ్డ జగన్‌ వయసు 49 ఏళ్లు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు 2024లో మన ప్రభుత్వం మీద ఒంటరి పోరాటం చేస్తానని మాత్రం చెప్పడం లేదు. ఎందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మీద ఆధారపడుతున్నారో తెలుసా? ఈ పెద్దమనిషి చేసింది చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పథకం లేదు.   

►  చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తామని చెప్పింది. చివరకు 5 ఏళ్లలో కనీసం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మనం బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రతి ఏటా రూ.15 వేల కోట్లు, 5 సంవత్సరాలలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పాం. ఈ మూడున్నరేళ్లలో బీసీలకు మాత్రమే, డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఖర్చు చేసిన మొత్తం ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు. ఇందులో డీబీటీ ద్వారా ఇచ్చిన సొమ్ము రూ.86 వేల కోట్లు. వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇదీ.   

నవరత్నాలు.. సామాజిక సాధికారత  
► నవరత్నాల్లో మొదటిది ఆర్థిక సాధికారత, డీబీటీ, నాన్‌ డీబీటీ పరంగా అడుగులు వేశాం. రెండోది రాజకీయ సాధికారత, దీనికి అద్దం పట్టే విధంగా పదవులు, నియామకాలు. ఈ రెండింటి ద్వారా సామాజిక సాధికారత దిశగా పయనించాం. మహిళా సాధికారత నాలుగో విషయం. రేపటి తరాల భవిష్యత్‌ నిర్ణయించే విద్యా సాధికారత ఐదోది.   

► గత మూడున్నరేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.3,19,228 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఇందులో మొత్తంగా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోద­రు­లు, అక్కచెల్లెమ్మలకు అందించింది అక్షరాలా రూ.2,50,358 కోట్లు. అంటే దాదాపు 80 శాతం.     

దోచుకుతిన్న చంద్రబాబు, ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు   
► 2018–19లో చంద్రబాబు హయాంలో బడ్జెట్‌ ఎంత ఉందో.. మన అందరి ప్రభుత్వానిది కూడా దాదాపు అంతే బడ్జెట్‌. అప్పుడు అప్పుల పెరుగుదల రేట్‌ 19 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం మాత్రమే. అదే రాష్ట్రం అదే బడ్జెట్, మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. మరి అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కారణం అప్పట్లో ఆ బడ్జెట్‌ను చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు.. మాత్రమే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అనే పద్దతిలో తినేసే పరిస్థితి.  

► ఈ రోజు మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు ఆ డబ్బు నేరుగా మీ ఇంటికి వస్తుంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతి ఇంట్లో చిరునవ్వులు ఇవ్వగలిగాం.  

► మన దేశంలో బీసీలకు మేలు చేయడానికి 1980లో వచ్చిన మండల్‌ కమిషన్‌ నాటి నుంచి అనేక కమిషన్లు, కమిటీలు ఏర్పాటైనా ఎక్కడా విద్య, ఉద్యోగాల విషయంలో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. అలాంటిది మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం రాజకీయ సాధికారత విషయంలో చేతలతో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది.  

రాజకీయ సాధికారత అంటే ఇదీ..    
► మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం నా బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీలకు స్థానం కల్పిస్తే.. రెండో విడతలో దానిని ఏకంగా 70 శాతానికి తీసుకెళ్లాం. ఐదుగురుకి ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇస్తే అందులో నలుగురు ఈ వర్గాల వారే. 25 మంది మంత్రులలో 11 మంది ఈ రోజు బీసీలే ఉన్నారు. 

► 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. మీ బిడ్డ రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు మన బీసీలే. 

► శాసనమండలిలో మన పార్టీ తరఫున 32 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 18 మంది నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. శాసనసభ స్పీకర్‌గా ఇదే వేదికపై ఉన్న తమ్మినేని సీతారామ్‌ బీసీ. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చొబెట్టాం.    

స్థానిక సంస్థలలో సింహభాగం వాటా  
► స్థానిక సంస్థలకు మొత్తంగా 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేసింది. అందులో ఒక్క బీసీలకు మాత్రమే 237 ఎంపీపీ పదవులలో కూర్చోబెట్టాం. అంటే 38 శాతం. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 67% ఇవ్వగలిగాం. 

► 13  జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో బీసీలకు 6 పదవులు అంటే 46 శాతం ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 9 పదవులు అంటే 69 శాతం చైర్మన్‌ పదవులు.  

► 14 నగర కార్పొరేషన్‌ మేయర్‌ పదవులలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తే.. బీసీలకు ఏకంగా 9 పదవులు అంటే 64 శాతం ఇచ్చాం. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కు గాను 12 పోస్టులు అంటే 86 శాతం మేయర్‌ పదవులు కట్టబెట్టాం.  

► 87 మున్సిపాల్టీలకు గాను 84 చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేసింది. ఇందులో 44 మున్సిపల్‌ ఛైర్మ­న్లుగా బీసీలు.. 53% కనిపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 58 స్థానా­ల్లో 69 శాతంగా వీరే రాజ్యాన్ని పాలిస్తున్నారు.  

జయహో బీసీ అంటే ఇదీ..  
► 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్ల పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 117 అంటే 60 శాతం ఇచ్చాం.  

► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 53 పదవులు (39 శాతం) బీసీలకే ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 79 అంటే 58 శాతం పదవులు ఇచ్చాం. వీటిలో 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులుంటే అందులో 201 బీసీలకు 41 శాతం ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 280 అంటే 58 శాతం ఇచ్చాం. 

► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. వీటిలో మరో 684 డైరెక్టర్‌ పదవులన్నీ వీరికే ఇచ్చాం. ఆలయ బోర్డులు, ఆలయ ఛైర్మన్‌ పదవులు తీసుకున్నా అందులో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇచ్చాం.   

► దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 సగభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. ఇందులో బీసీలు ఒక్కరే 2,650 పదవుల్లో 38 శాతం ఉన్నారు. ఇది జయహో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే.    

ఉద్యోగాలలోనూ అధిక శాతం వాటా  
► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల శా­శ్వ­త ఉద్యోగాలిచ్చాం. ఇందులో 84% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తమ్ముళ్లు, చె­ల్లెళ్లు ప­ని­చే­స్తున్నారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తా­మని లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా­మని చంద్రబాబు వాగ్దానం చేసి, మోసం చేశారు. 

► మన ప్రభుత్వంలో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో రెగ్యులరైజ్‌ అయ్యారు. ఆరోగ్య రంగంలో 46 వేల పోస్టులు.. అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌ ) ద్వారా మరో లక్ష మందికి ఎటువంటి దళారులు లేకుండా, లంచాలిచ్చే పరిస్థితి లేకుండా, కమీషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మెరుగైన జీతాలు కల్పిస్తున్నాం. కాంట్రాక్ట్‌లో పని చేస్తున్న వారికి తొలిసారిగా మినిమమ్‌ టైం స్కేల్‌ తీసుకొచ్చాం. 2.60 లక్షల మంది తమ్ముళ్లు, చెల్లెళ్లు వలంటీర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 83% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. మొత్తంగా 6 లక్షల పై చిలుకు మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తున్నారు.    

వారు ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో? 
► ప్రభుత్వ బడులన్నింటినీ నాడు–నేడుతో రూపురే­ఖలు మార్చుతున్నాం. బైలింగ్యువల్‌ బుక్స్, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొచ్చాం. ఇన్ని చేస్తుంటే పెత్తందారీ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మొత్తంగా ఎల్లోబ్రదర్స్‌ వారితో పాటు దత్తపుత్రుడికి బాధ కలుగుతోంది. వీరంతా ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో అందరూ ఆలోచించాలి.  

► పేదలకు ఇళ్ల స్ధలాలిస్తామంటే కోర్టులో కేసులు వేస్తారు. అమరావతిలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై­నా­ర్టీలకు ఇళ్ల పట్టాలిస్తామంటే.. సామాజిక సమ­తుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వే­యి­స్తారు.  చివరకి ప్రాంతాల వారీగా వారి ఆత్మ­గౌరవాన్ని నిలబెట్టేలా 3 రాజధానులు చేస్తామని అంటే వీళ్లంతా అరిచి గీపె­డుతున్నారు. వారు ఇ­లాగే పేదరికంలో మిగిలి­పోవాలన్నది వారి ఆ­లోచన. వీళ్లను శాశ్వతంగా పేదరికంలోంచి ఎలా బ­యటకు తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం తాపత్ర­యం. మానవతావాదానికి ప్రతీక వైఎస్సార్‌సీపీ.  
   
మహిళా సాధికారత దిశగా..  
►  ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 21.20 లక్షల ఇళ్లు కూడా నిర్మాణంలో ఉ­న్నాయి. ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలలో నా బీసీ అక్కచెల్లెమ్మలకు 16,70,286 ఇళ్లు ఇవ్వగలిగాం. అంటే 56 శాతం బీసీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చి మేలు చేశాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అక్కచెల్లెమ్మలను కలుపుకుంటే.. 88 శాతం వీళ్లకే ఇళ్ల పట్టాలిచ్చాం. వీటిలో ఇళ్లు కట్టడం కూడా పూర్తయితే ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి 10 లక్షలు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. రాష్ట్రం మొత్తంగా రూ.2..3 లక్షల కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టినట్లవుతుంది. 

► 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.9,294 కోట్లు.. అంటే 73%. రేపు జనవరిలో మరో రూ.6,379 కోట్లు వారి చేతుల్లో పెట్టబోతున్నాం.   

► దాదాపు కోటి రెండు లక్షల మంది ఉన్న నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రూపంలో రూ.3,615 కోట్లు ఇచ్చాం. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.2,803 కోట్లు ఇచ్చాం. అంటే 78 శాతం నిరుపేద అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. 

► 45 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న దాదాపు 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు, చెల్లెమ్మలకు వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.14,110 కోట్లు ఇచ్చాం.   

► జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 44.50 లక్షల మంది చెల్లెమ్మలకు రూ.19,617 కోట్లు ఇచ్చాం. ఇందులో రూ.15,378 కోట్లు అంటే 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెల్లెమ్మల చేతిలో పెట్టాం. మరో 25 లక్షల మంది పిల్లలకు, తల్లులకు మేలు చేస్తూ.. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన డబ్బులన్నీ ఆ తల్లుల ఖాతాల్లో జమ చేశాం.   

చెప్పినట్లుగా బీసీ డిక్లరేషన్‌ అమలు  
►  చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశాం. శాశ్వత బీసీ కమిషన్‌ను దేశంలో తొలిసారిగా నియమించాం. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం.  

► ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల వరకు ఇతర నామినేటెడ్‌ పదవులన్నింటిలోనూ ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కనిపిస్తున్నారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న 85 వేల మందే ఇందుకు సాక్ష్యం. నామినేషన్‌ పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేస్తున్నాం. 

► జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా షాపులు పెట్టుకుని సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న బీసీలకు, చిరు వ్యాపారులకు అండగా నిలిచాం. ఈ మూడున్నరేళ్లలో చేదోడు ద్వారా రూ.584 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. జగనన్న తోడు ద్వారా రూ.2,059 కోట్లు సున్నా వడ్డీ రుణాలు అందించాం. తద్వారా దాదాపు 15 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి.  

► 45 ఏళ్లు నిండిన 26.40 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం చేయూత పథకం ద్వారా మేలు చేస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో రూ.14,110 కోట్లు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక సాధికారతను బలోపేతం చేశాం. సన్నిధిగొల్లలకు తిరుమల ఆలయం తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును పునరుద్ధరిస్తూ  జీవో జారీ చేశాం. 

► ఎంత పెద్ద చదువైనా సరే వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలూ చెల్లించాం. ఈ మూడున్నరేళ్లలో రూ.9,052 కోట్లు ఖర్చు చేశాం. హాస్టల్‌ ఖర్చుల కోసం వసతి దీవెన కింద రూ.20 వేల వరకు ఇస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఈ పథకానికి రూ.3,349 కోట్లు వెచ్చించాం. 

► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ.418 కోట్లు అందించాం. సొంత మగ్గమున్న నేత కార్మికులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఈ మూడున్నరేళ్లలో రూ.776 కోట్లు వారి చేతుల్లో పెట్టాం.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top