పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువుల్లేవు | CM Chandrababu reviews IVRS | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువుల్లేవు

Jun 15 2025 2:32 AM | Updated on Jun 15 2025 2:32 AM

CM Chandrababu reviews IVRS

మహిళలపై హింస, బహిరంగ ప్రాంతాల్లో వేధింపులున్నాయి

నిరంతర విద్యుత్‌ సరఫరా అంతంతమాత్రమే

ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్‌ విషయంలోనూ తీవ్ర అసంతృప్తి

ఐవీఆర్‌ఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

10 ప్రధాన ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించాలని ఆదేశం 

సాక్షి, అమరావతి: రైతులకు ఎరువుల లభ్యత, విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని.. సరఫరా కూడా కావడంలేదని టీడీపీ కూటమి ప్రభుత్వం సేకరించిన ఐవీఆర్‌ఎస్‌ ప్రజాభిప్రాయంలో తేలింది. మహిళలపై హింస, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులున్నాయని కూడా అందులో స్పష్టమైంది. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల మీద వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సమీక్షలో ఎరువుల లభ్యతలేదని 39.1 శాతం మంది రైతులు.. విత్తనాలు సమయానికి సరఫరా జరగలేదని 37 శాతం మంది రైతులు కుండబద్దలు కొట్టారు. మహిళలపై హింస, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు జరుగుతున్నాయని 27.8 శాతం మంది చెప్పారు. తమ ప్రాంతంలో డ్రగ్స్‌ సంబంధిత సమస్య ఉందని 27.4 శాతం మంది.. విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా జరగడంలేదని 38.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్‌ విషయంలో 46.6 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేశారు.  

జీరో కరప్షన్‌ దిశగా పాలన..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ శాఖలో ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేదిలేదని.. జీరో కరప్షన్‌ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలన్నారు. అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్‌ ఆడిటింగ్‌ జరపాలని.. సమస్యలున్న చోట సంతృప్తిస్థాయి పెంచేలా చూడాలని చంద్రబాబు అన్నారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. వాటి పరిష్కారానికి కృషిచేయాలని చెప్పారు. 

175 నియోజకవర్గాల్లో జాబ్‌ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సప్‌ గవర్నెన్స్‌ ‘మన మిత్ర’ ద్వారా అందించాలన్నారు. మరోవైపు.. వికలాంగులు, వృద్ధులకు రేషన్‌ సరుకుల పంపిణీ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచించాలన్నారు. చౌకధరల దుకాణాలను పెంచడం.. నగదు  లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే, ఇసుకపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement