సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశాను: చంద్రబాబు | Chandrababu Naidu Says That He Implemented Super Six Promises, More Details Inside | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశాను: చంద్రబాబు

Jun 13 2025 3:20 AM | Updated on Jun 13 2025 4:15 PM

Chandrababu Says that he implemented Super Six Promises

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ.. 

ఇక ఎవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరొకటి కాదు 

‘తల్లికి వందనం’ కింద రూ.13 వేలు ఇస్తున్నాం.. పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతి అనుసంధానం

20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు  

పోలీసులు నడిరోడ్డుపై దళితులను కొడితే జగన్‌ పరామర్శిస్తాడా? 

పొగాకు రైతుల బాధలు వినేందుకెళ్లి దౌర్జన్యం చేశారు  

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా సూపర్‌ సిక్స్‌ గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని అన్నారు. తల్లికి వందనం పథకం అమలుపై గురువారం ఆయన ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట మేరకు.. నలుగురు పిల్లలున్న వారికి కూడా ఇస్తున్నామని తెలిపారు. 

67 లక్షల మంది పిల్లలకు రూ.13 వేలు చొప్పున వారి తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. మిగతా రెండు వేల రూపాయలు స్కూళ్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి అమ్మ ఒడి మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని చెప్పారు. పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశామన్నారు. ఈ నెల 20న కేంద్రం రైతులకు డబ్బులు వేస్తుందని, అదే రోజు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రం తొలి వాయిదా ఇస్తుందన్నారు. 

ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని, దీంతో సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసినట్లేనని తేల్చి చెప్పారు. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై దళితులను బహిరంగంగా లాఠీలతో కొట్టిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్‌ జగన్‌ ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘దేవతల రాజధాని అమరావతిని వేశ్యల నగరం అంటారా... ఎంత కొవ్వు ఎక్కింది.. మీడియా ఏం చేస్తోంది.. ఆ అంశాన్ని డైవర్ట్‌ చేయడానికే జగన్‌ 15 వేల మందితో పొగాకు రైతుల దగ్గరకు వెళ్లి రౌడీయిజం చేశారు. 

పొగాకు క్వింటా రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నాం. రాజకీయ ముసుగులో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. తీవ్రవాదులపైనే పోరాటం చేసిన వాడిని. ప్రజల భద్రత విషయంలో రాజీపడను. ఏం చేయాలో చేసి చూపిస్తా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు నడుస్తోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. 60 శాతం కుటుంబాలకు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement