ఇంటింటా మద్యం.. ఇదే బాబు విధానం | Chandrababu Naidu govt Scam in liquor shops, Belt shops | Sakshi
Sakshi News home page

ఇంటింటా మద్యం.. ఇదే బాబు విధానం

Apr 6 2025 4:25 AM | Updated on Apr 6 2025 4:25 AM

Chandrababu Naidu govt Scam in liquor shops, Belt shops

విద్యుత్‌ వెలుగుల మధ్య ఇంత దర్జాగా కనిపిస్తోందంటే.. ఇది వైన్‌షాపు అనుకునేరు.. కానేకాదు. కేవలం అనధికార బెల్టు షాపు మాత్రమే. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో జనావాసాల మధ్య రాత్రింబవళ్లు నిర్వహిస్తున్న బెల్ట్‌షాపు ఇది..

ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం..

కూటమి నేతల సిండికేట్‌ కబంధ హస్తాల్లో మద్యం షాపులు

ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు ‘నీకింత.. నాకింత’ అంటూ పంపకాలు 

అనుమతిచ్చింది 3,396 షాపులకే.. వీటికి అనుబంధంగా ఊరూరా బెల్ట్‌ షాపులు.. గత బాబు పాలనలో 43 వేలకుపైగా బెల్ట్‌షాపులు.. ఇప్పుడు అంతకుమించి..

ఒక్కో బెల్ట్‌ షాపునకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు.. కొన్నిచోట్ల రూ.20 లక్షల వరకు వసూళ్లు 

పోలీసుల సమక్షంలోనే వేలం పాటలు 

వేళాపాళాలేని విక్రయాలు.. సిట్టింగ్‌ రూమ్‌లు  

బెల్ట్‌ షాపుల్లో క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.50 అదనపు బాదుడు 

ఫలితంగా ప్రమాదంలో ప్రజారోగ్యం.. కుటుంబాలు విచ్ఛిన్నం.. బాలికలు, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు 

పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు.. పేద కుటుంబాలు చిన్నాభిన్నం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్‌ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారని స్పష్టమవుతోంది.  

మద్యం షాపుల కోసం ఇతరులెవ్వరూ దరఖాస్తు చేసుకోనివ్వకుండా ఎక్కడి­కక్కడ బెదిరించారు. ఒకవేళ లాటరీలో ఇతరులెవరికైనా దక్కినా బలవంతంగా లాగేసుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టు­కుని పంచాయితీలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఈ షాపులకు అనుబంధంగా సగటున ఒక్కో దుకాణానికి 10–15 బెల్ట్‌ షాపులను అనుచరులతో ఏర్పాటు చేయించారు. వాటి కోసం పోలీసుల సమక్షంలోనే వేలం పాటలు నిర్వహించారు. ఇలా ఒక్కో బెల్ట్‌ షాపునకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట 20 లక్షల వరకు దండుకున్నారు. క్వార్టర్‌ బాటిల్‌పై ఎమ్మార్పి కంటే అదనంగా రూ.20 నుంచి 30 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

వెరసి వేళాపాళా లేకుండా రాష్ట్రంలో ఎక్క­డైనా సరే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయ­త్నాలు, హత్యలు జరిగిపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పేదల కుటుంబ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిపోయింది. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా.. ‘తాగండి.. తూగండి’ అంటూ ఇంటింటా మద్యం వరద పారించడమే తమ విధానం అన్నట్లు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన చెందడంతో జనవరి 29న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లికి చెందిన మహబూబ్‌ బాషా (32) మితిమీరి మద్యం తాగి.. స్పృహ కోల్పోయి గత అక్టోబర్‌ 17న మరణించాడు. ఇతడి మృతితో అతని భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లయ్యారు. ఇలాంటి దీన గాధలు ఊరూరా కనిపిస్తున్నాయి.

పర్మిట్‌ రూమ్‌లతో పని లేకుండానే బార్లను తలపించేలా సిట్టింగ్, చికెన్‌ చీకులు, సోడాలు, ఆమ్లెట్లు, సిగిరెట్ల విక్రయాలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతున్నాయి. వాట్సాప్‌ ద్వారా అడ్రస్‌ పెట్టి డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ప్రత్యేకంగా డోర్‌ డెలివరీ సౌకర్యం కూడా కల్పించారు.ఆ వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొన్ని మద్యం షాపుల్లో థాయ్‌లాండ్, శ్రీలంక, బ్యాంకాక్, మారిషస్‌ టూర్లు.. అంటూ లక్కీ డిప్‌ పెడుతుండటం శోచనీయం.

ఇది నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్‌లో మద్యం దుకాణం. వైన్‌ షాపు పక్కనే కూల్‌డ్రింక్స్‌ షాపు పేరుతో బెల్టు దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడ ఎనీటైం మద్యం అందుబాటులో ఉంచారు. బెల్టు దుకాణంలో మాత్రం బాటిల్‌పై అదనంగా రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది. కానీ.. అధికారులకు మాత్రం కన్పించదు.

సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్‌వర్క్‌: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఊరూ.. వాడా.. మద్యం ఏరులై పారుతోంది. ఆదాయమే తప్ప సామాజిక బాధ్యతను పట్టించుకోని ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్‌ లిక్కర్‌ ఇస్తానని హామీలు గుప్పించారు. అ«ధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలతో ఎక్కడికక్కడ సిండికేట్‌లు ఏర్పాట­య్యాయి. దుకాణాలకు దరఖాస్తు చేయడం మొదలు బెల్ట్‌ షాపుల ఏర్పాటు వరకు అడ్డగోలుగా అక్రమార్జనకు తెరతీశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకింత.. నా కింత అంటూ దండుకుంటున్నారు. ఇందులో భాగంగా దుకా­ణాల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్‌ కుట్రలకు పాల్పడింది. 

అడిగిన మేరకు కమీషన్‌ లేదా ఉచిత వాటా ఇస్తారా.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని కూటమి ప్రజాప్రతి­నిధులు హుకుం జారీ చేశారు. మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు బరితెగించి బెదిరింపులకు దిగారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్‌ సభ్యులు కానివారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేస్తే వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. దారికిరాని వారిపై దాడులు కూడా చేశారు. 

లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్‌ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్‌ ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. కొన్ని చోట్లయితే ఖర్చులు చెల్లించి బలవంతంగా దుకాణాలను చేజిక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధుల హెచ్చరికలతో మద్యం దుకాణా­లకు దరఖాస్తు చేయాలని ఆలోచించేందుకే సామాన్య వ్యాపారులు భయపడ్డారు. 

మొత్తం 3,396 మద్యం దుకాణాల్లో ఏకంగా 80 శాతం షాపులు టీడీపీ సిండికేట్‌లు దక్కించుకోగా, మరో 20 శాతం వేరే వాళ్లకు లైసెన్స్‌లు వచ్చినప్పటికీ వారిని బెదిరించి మరీ సిండికేట్‌లో విలీనం చేయించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేట్‌ వ్యక్తులకు లైసెన్స్‌లు కట్టబెట్టడంలోనూ మరోస్కామ్‌కు పాల్పడ్డారు. టెండర్లలో శాతం మార్జిన్‌ పెట్టి, అవన్నీ ఖరారై ఎస్టాబ్లిష్‌ అయిన తర్వాత 14 శాతం మార్జిన్‌ పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు. రూ.99 చీప్‌ లిక్కర్‌ మినహా అన్ని బ్రాండ్ల ధరలు మండిపోతున్నాయి. 

ఫలితంగా మద్యం షాపుల్లో విక్రయించే ప్రతి బాటిల్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు ప్రాంతాన్ని బట్టి ‘ముఖ్య’ నేతకు కమీషన్‌ ఇచ్చేలా వ్యవహారం సాగింది. ఇలా ప్రతి నెలా కమీషన్‌తోపాటు ధరల పెంపుతో ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్లు దక్కాయని సమాచారం. ఈ అక్రమ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రభుత్వ కీలక నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.  

గుడి, బడి.. ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు
గత ప్రభుత్వంలో మద్యం షాపులు ఎక్కడో ఉండేవి. ఈ ప్రభుత్వంలో గుడి, బడి లేదు.. ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాట­య్యా­యని ఇటీవల తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో టిఫిన్, జ్యూస్‌ సెంటర్లు, పాన్‌షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. అది కూడా ఒక్కో బెల్ట్‌ షాపునకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట ప్రాంతాన్నిబట్టి రూ.20 లక్షల వరకు వేలం పాట ద్వారా రాబట్టుకున్నారు. 

దీంతో సమీపంలోని లైసెన్స్‌ మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపుల నిర్వాహకులు రోజువారీగా మద్యం తెచ్చుకుని క్వార్టర్‌ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 మేర అధిక ధరలకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.50 కూడా అదనంగా వసూలు చేస్తు­న్నారు. లైసెన్స్‌ మద్యం దుకాణాలకు సమయాలు నిర్దేశించినప్పటికీ ఎక్కడా వేళాపాళా లేకుండా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయంలో ముందు గేటు మూసివేసి, వెనుక నుంచి.. కిటికీ లోంచి విక్రయాలు జరుపుతున్నారు. 

రాత్రి వేళ మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఇక బెల్ట్‌షాపులైతే 24 గంటలూ అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో యథేచ్చగా మద్యం మాఫియా రాజ్యమేలుతోందనడానికి ఇదే నిదర్శనం. కర్నూలు జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం పరిధిలోని బెల్టు దుకాణాల్లో కర్ణాటక మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతలు సమీపంలోని కర్ణాటక నుంచి మద్యం తెప్పించి బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో బెల్టుషాపులో మద్యం అమ్మకాల జోరు, తిరుపతి జిల్లా చిట్టమూరులో ఫోన్‌లో ఆర్డర్‌ తీసుకుని వాహనంలో డోర్‌ డెలివరీ చేస్తున్న మద్యం  

పెరిగిపోతున్న గొడవలు, అరాచకాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుగ్రామంలో సైతం మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదు­ర్కొంటున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా మంది రోజూ తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతు­న్నాయి. తాగిన మైకంలో బాలికలు, మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. 

పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. పేద కుటుంబాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. భార్యాభర్తలు, పిల్లల మధ్య గొడవలు పెరిగిపోయాయి. కొద్ది నెలలుగా నిత్యం పోలీస్‌స్టేషన్లకు పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం.

వైఎస్‌ జగన్‌ అలా..   చంద్రబాబు ఇలా..
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సారా డబ్బుతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు.. తొలి నుంచి మద్యం పాలసీని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మద్య నిషేధాన్ని అటకెక్కించిన చంద్రబాబు.. తన పార్టీ నేతలు, బడాబాబుల నేతృత్వంలో మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. 

మద్యంను తన వాళ్లకు ఆదాయ వనరుగా మార్చేశారు. చంద్రబాబు విధానాలకు చెక్‌ పెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా, మహిళల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేశారు. మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరచడం, మద్యపానంపై నియంత్రణ పాటించడమే ప్రధాన లక్ష్యంగా పాలసీని రూపొందించారు. 

వేళపాళా లేకుండా అధిక ధరలకు అమ్మే సిండికేట్‌ వ్యవస్థకు చెక్‌ పెట్టారు. లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులను తొలగించారు. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు జరిపించారు. మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. 33 శాతం షాపులను తీసేశారు. షాపులకు అనుబంధంగాఉన్న 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. రాష్ట్రంలోని 43,000 బెల్టుషాపులను ఎత్తివేశారు. మద్యం విక్రయించే వేళలను కూడా పరిమితం చేశారు. 

ప్రతి ఊరికీ ఒక మహిళా పోలీసును పెట్టారు. ఎక్సైజ్‌కు సంబంధించి నేరాలకు పాల్పడితే అంగీకరించే ప్రశ్నే లేదని కఠినంగా వ్యవహరించిన విషయం విదితమే.  లిక్కర్‌ టెస్టింగ్‌ కోసం కొత్త ల్యాబులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న 20 డిస్టిలరీల్లో 14 సంస్థలకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అనుమతులు ఇవ్వగా, మిగిలిన వాటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. పైగా మద్యం విక్రయాలు తగ్గాయి.

జగన్‌ హయాంలో సెబ్‌ ద్వారా ఉక్కుపాదం
మద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను ఏర్పాటు చేసింది. సెబ్‌ సిబ్బంది ప్రత్యేక చెక్‌ పోస్టులుపెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. భారీ ఎత్తున దాడులు నిర్వహించి మత్తు పదార్థాలు, మద్యం, సారా అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపింది. 

మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించి, క్షేత్ర స్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహించింది. సెబ్‌ దూకుడుగా వ్యవహరించినిందితులను పట్టుకుని వేలాది కేసులు నమోదు చేసింది. నవోదయం–పరివర్తన పేరిట సారా తయారీ కేంద్రాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్‌లు ఇచ్చి వారు ఆ వృత్తిని వదిలేసేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలేవీ కనిపించడంలేదు.

మహిళలపై పెరుగుతున్న దాడులు
గత ప్రభుత్వంలో బెల్ట్‌ షాపులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 4, 5 బెల్టు షాపులను ఏర్పాటు చేసి విచ్చల­విడిగా మద్యం అమ్మకాలు జరుపు­తున్నారు. ఇదంతా కళ్లెదుటే జరు­గు­తున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? గ్రామా­ల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మ­కాలతో సామాన్య కుటుంబాలకు తీరని నష్టం కలుగుతోంది. మహిళలపై దాడులు పెరిగి­పో­తు­న్నాయి. నూతన మద్యం పాలసీ అంటే ఇదేనా?    
– కంచర్ల పద్మావతి, పరిటాల, ఎన్టీఆర్‌ జిల్లా

ఇంతలో ఎంత తేడా?
రాష్ట్రంలో 1990 దశకంలో మద్యానికి వ్యతి­రే­కంగా మహిళా ఉద్యమం పెల్లుబికి 1995­లో ఎన్టీఆర్‌ సీఎంగా మొదటి సంతకం మద్య నిషేధంపై చేశారు. రెండేళ్లు అమలులో ఉంది. ఆయ­నకు వెన్ను­పోటు పొడిచి సీఎం అయిన అల్లుడు చంద్ర­బాబు నిషేధం ఎత్తేశాడు. వైఎస్‌ జగన్‌ వచ్చా­క మాత్రమే చిత్తశుద్ధితో కూడిన దశల వారీ­గా మద్య నియంత్రణ సాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. ఇంతలో ఎంత తేడా?  
– ఈదర గోపీచంద్, సోషల్‌ యాక్టివిస్టు, నరసరావుపేట

గిరిజనులు బానిసలు అవుతున్నారు
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బెల్ట్‌ దుకాణాల ద్వారా మద్యం అమ్మ­కాలు విచ్చలవిడిగా జరుగు­తు­­న్నాయి. అనేక దుకాణాల్లో కూల్‌ డ్రింక్‌ల మాదిరిగా మద్యం బాటిళ్లను అమ్మడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూస్తుండడంతో గిరి­జన ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగి, గిరి­జనులు మద్యానికి బానిసలవుతు­న్నా­రు. గిరిజన కుటుంబాల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోంది.  
– వి.వి.జయ, అరకులోయ, అల్లూరి జిల్లా

మద్యం షాపులను ప్రభుత్వమే నడపాలి
రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి ప్రభు­త్వ ఖజానాకు దండిగా కాసులు రాబ­ట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీధివీధిలో బెల్టుషాపు­లు తెరి­పించి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. నా­ణ్య­మైన మద్యం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అంటున్నాడు. అంటే ఈ మద్యం ఎంత తాగినా ప్రమా­దం కాదా? తాగి తాగి రోగాల పాలైతే ఎవరు జవా­బు­దారీ? కుటుంబాలను ఛిద్రం చేస్తు­న్నారు. మ­ద్య­ం షాపులను ప్రభుత్వమే నిర్వహించి అమ్మకాలు పరిమితం చేయాలి.
    – సావిత్రి, అనంతపురం

పచ్చని పల్లెల్లో చిచ్చు
పచ్చని పల్లె సీమల్లో మద్యం భూతం బెల్టు రూపంలో చిచ్చు పెడుతోంది. పేదలు సంపాదనను తాగుడుకు తగలేస్తు­న్నా­రు. దీని వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతు­న్నాయి. మద్యానికి బానిసలైతే పనులు చేయలేరు. అప్పుడు తినే తిండికి కూడా కష్టం అవుతుంది. వెంటనే మద్యం కట్టడి చేయాలి.
– జ్యోతి, యానాది కాలనీ, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement