
జహరాబీకి ప్రభుత్వం పంపిన మెసేజ్, సర్టిఫికెట్
మరణించిన వారి ఆత్మలతో యోగా చేయించి రికార్డు
నమోదును విస్మరించిన కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పుష్ప సినిమాలో పోలీస్ అధికారి పాత్రధారి ‘ఒకటి తగ్గింది పుష్ప’ అని చెప్పే డైలాగ్ చాలా పాపులర్ అయింది. యోగాంధ్ర పేరిట గిన్నీస్, వరల్డ్ బుక్ రికార్డులు బద్దలు కొట్టామని కూటమి ప్రభుత్వం చంకలు గుద్దుకుంటోంది. ఈ క్రమంలో ‘ఒక రికార్డు తగ్గింది బాబు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఊపందుకున్నాయి. దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా మరణించిన వారి ఆత్మలతో సైతం యోగా చేయించి ఆ రికార్డును నమోదు చేసుకోవడాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని నెటిజనులు చింతిస్తున్నారు.
ఆత్మలను సైతం తట్టి లేపి యోగా చేయించిన ఘనత ప్రపంచంలో చంద్రబాబుకు తప్ప మరెవరికీ దక్కలేదన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన షేక్ జహరాబీ 2017లో మరణించింది. ఆమె మరణాన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ సైతం విడుదల చేసింది. కాగా, జహరాబీ యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కుటుంబ సభ్యులకు మెసేజ్ వచ్చింది. అంతేకాదు ప్రభుత్వం ప్రశంసాపత్రాన్ని సైతం జారీ చేసింది. ‘యోగా డే గ్రాండ్ సక్సెస్ అయింది. రికార్డులన్నీ బద్దలు కొట్టేశాం.’ అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న క్రమంలో జహరాబీ డెత్ సర్టిఫికెట్, యోగాంధ్రలో రిజి్రస్టేషన్ చేసుకున్నట్టు వచ్చిన సందేశాలు, ప్రశంసాపత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.