‘యాక్సిస్‌’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్‌' | Chandrababu Govt current scam with Axis Energy Venture India Private Limited | Sakshi
Sakshi News home page

‘యాక్సిస్‌’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్‌'

May 5 2025 5:00 AM | Updated on May 5 2025 6:47 AM

Chandrababu Govt current scam with Axis Energy Venture India Private Limited

రూ.2.49కి నాడు గగ్గోలు.. రూ.4.60కి నేడు అడ్డగోలు

కరెంట్‌ కుంభకోణానికి చంద్రబాబు ‘యాక్సిస్‌’ 

కారుచౌక ఒప్పందంపై అప్పుడు విషం.. 

పాతికేళ్లకు అధిక రేట్ల ‘ఫిక్సింగ్‌’ ఇప్పుడు  

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినం­దిం­చాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. 

తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్‌ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. 

గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్‌ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. 

ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. 
టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. 

చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్‌ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్‌ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్‌ అవర్స్‌లో డిమాండ్‌ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. 

ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్‌ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్‌లో ఆమోద ముద్ర వేయించారు. 

గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. 
 


పాతికేళ్ల పిడుగు.. 
యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పవన–సౌర హైబ్రీడ్‌) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌ పాతికేళ్ల పాటు యూనిట్‌ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 

25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్‌’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్‌లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. 

ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? 
డిస్కమ్‌ల పిటిషన్‌పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్‌తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్‌ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి  వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్‌లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్‌ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్‌ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.  తాననుకున్నదే చేసింది. 

యాక్సిస్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు 

మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..
గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్‌ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసింది. 

ఇప్పుడేమంటావు కరపత్రమా ? 

కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు   

గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్‌ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్‌ జగన్‌ పెంచారు. విద్యుత్‌ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్‌ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్‌తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. 

నేడు సెక్షన్‌ 108తో మండలిని బెదిరించి.. 
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి  కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్‌ చట్టం 2003 సెక్షన్‌ 108 ప్రకారం యాక్సిస్‌తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్‌ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు.   

సెక్షన్‌ 108 ప్రకారం.. యాక్సిస్‌ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం 

నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ 
రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు  సెకీ నుంచి 17 వేల మిలియన్‌ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్‌ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్‌ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్‌ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. 


ప్రపంచవ్యాప్తంగా యూనిట్‌ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్‌ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. 

అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్‌ విద్యుత్‌ మార్కెట్‌లో యూనిట్‌ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్‌ డెవలపర్‌ నుంచి యూనిట్‌ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement