
సాక్షి, విజయవాడ: ఏపీ విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలకు కూటమి సర్కార్ తిలోదకాలు పలికింది. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలను ఆపేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ జగన్కు పేరు రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సంస్కరణలపై వేటు వేస్తోంది.
..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన కీలక సంస్కరణలను ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో సీబీఎస్ఈ సిలబస్ను కూడా ఎత్తేస్తామని ఆయన తెలిపారు. ఇక, బైజూస్ ట్యాబ్లు దండగ అంటూ టీడీపీ ముద్ర వేసింది. పిల్లలకు ఇచ్చే ట్యాబ్ల పంపిణీకి కూడా మంగళం పాడేయాలని కూటమి సర్కార్ నిర్ణయించుకుంది.
మరోవైపు.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే ఏడాది నుండి ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్టు అశోక్ బాబు తెలిపారు. ఇక, ఇప్పటికే టోఫెల్ శిక్షణను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలు తేవాలని వైఎస్ జగన్ ఎంతగానో ప్రయత్నించారు. కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడేందుకు ఆధునిక పద్ధతులను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే టోఫెల్, ఐబీ సిలబస్, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ వంటి వాటిని వైఎస్ జగన్ అమలుచేశారు. దీంతో, వైఎస్ జగన్కు పేరు రావొద్దని భావించిన చంద్రబాబు.. సంస్కరణలు అన్నింటినీ ఎత్తేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలపై వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు తన పార్టీ ఎమ్మెల్సీలు, ఎల్లో పత్రికలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయిస్తున్నారు. క్రమంగా ఒక్కో సంస్కరణపై చంద్రబాబు వేటు వేసుకుంటూ వస్తున్నారు.