యోగాంధ్ర రిజిస్ట్రేషన్లకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై కత్తి
ఆదివారం కూడా రిజిస్ట్రేషన్లు చేయించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టి పని చేయిస్తోంది. ఈ ఆదివారం కూడా వారికి సెలవు లేకుండా పోయింది. యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల టార్గెట్లు పూర్తి చేయనిపక్షంలో చర్యలు ఉంటాయని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఆదేశించడంతో సెలవు రోజూ సాయంత్రం దాకా విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటి మందిని రిజిస్ట్రేషన్లు చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టగా.. శుక్రవారం నాటికి కేవలం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కాకపోవడంతో శనివారం కూడా ప్రతి ఉద్యోగి కనీసం 25 మంది చొప్పున రిజిస్ట్రేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి పని చేయించారని ఉద్యోగ సంఘ నేతలు వాపోతున్నారు.
శనివారం రాత్రే పలు జిల్లాల్లో ఆదివారం ఎవరికీ సెలవు లేదంటూ ఉద్యోగులకు మెసేజ్లు పంపించారు. ఆదివారం ఉదయం యోగాంధ్ర శిక్షణ తరగతుల నిర్వహణ, ఆ తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశాలు ఇచి్చనట్టు పలువురు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. ఆదివారం కూడా మండల, జిల్లా అధికారులు విడతల వారీగా సచివాలయ ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించడంతో సాయంత్రం వరకు పనిచేసినట్లు పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.


