ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్న చంద్రబాబు సర్కారు
‘ఎక్స్’లో 150కి పైగా ఖాతాలు, 770కి పైగా పోస్టులపై తొలగింపు అభ్యర్థనలు
‘డీఎస్సీ’ బండారం బయటపడగానే సాక్షి టీవీ, సాక్షి డిజిటల్ సహా ఖాతాలపై వేటు
జర్నలిస్టులు, సాధారణ పౌరులు, ప్రతి పక్షాలు.. ఎవరికీ మినహాయింపులేదు..
జిల్లాల్లో ఇన్స్పెక్టర్లే సెన్సార్ బోర్డులు..
ఏకంగా ‘ఎఫ్బీఐ’ పేరుతో ఎక్స్కు పోలీసుల ఫిర్యాదు
ఖాతాలు మూయకపోతే బెదిరింపులు, అరెస్టులు
సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిఘా సెల్
రాష్ట్రంలో నడుస్తున్న ‘సెన్సార్’ పాలన
సాక్షి, అమరావతి: అధికారాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా.. లేక ప్రశ్నించిన గొంతునే మూయించాలా? రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారాలపై తాజాగా తలెత్తుతున్న వివాదాలు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అరాచక, అసమర్థ పాలనను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. డీఎస్సీ–2025కు సంబంధించిన అక్రమాలపై ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. వాటిని ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు, ఖాతాలపై ఫిర్యాదులు, తొలగింపు అభ్యర్థనలు, కేసుల దిశగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోస్ట్ తొలగింపు.. ఖాతా నిలిపివేత.. కుదరకపోతే కేసు, అరెస్టు అన్నట్టుగా పరిస్థితి మారిందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జవాబు చెప్పాల్సిన చోట.. ఖాతాలపై వేటు?
డీఎస్సీ–2025 నియామకాలపై వైఎస్సార్సీపీ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిలో కొన్ని ఉదంతాలు వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. వరుసగా ఆధారాలు బయటపెడుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి అయిన ఆయన కుమారుడు లోకేశ్ గుక్కతిప్పుకోలేకపోతున్నారు. అందుకే ఆయా పోస్టులు, ఖాతాలపై చర్యలకు దిగుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి వేదికల్లో ప్రతిపక్ష పారీ్టలకు చెందిన ఖాతాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల పోస్టులపై ఫిర్యాదులు చేయడం ద్వారా వాటిని తొలగించేందుకు లేదా భారత్లో కనిపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు చెబుతున్నారు. డీఎస్సీ అంశంపై పోస్టులు చేస్తున్న నేపథ్యంలో సాక్షి టీవీ ఫేస్బుక్ పేజీ, సాక్షి డిజిటల్ ఇన్స్ట్రాగామ్, బిగ్ టీవీ ఇన్స్ట్రాగామ్, జగనన్న కనెక్ట్స్ ఇన్స్ట్రాగామ్ ఖాతాలను తప్పుడు ఫిర్యాదులతో మూసివేయించారు. ఇందుకోసం సైబర్ క్రైమ్ విభాగాన్ని రంగంలోకి దింపి తప్పుడు ఫిర్యాదులు చేయిస్తోంది.
ఇన్స్పెక్టర్లే ‘సెన్సార్’ బోర్డులా?
ఉండవల్లి కరకట్ట క్యాంప్ ఆఫీసు నుంచి వెళ్లిన ఆదేశాలతో పలు జిల్లాల్లో సీఐలు ఎఫ్బీఐ వంటి అంతర్జాతీయ సంస్థల పేరుతో ‘ఎక్స్’కు తప్పుడు రిక్వెస్టులు పంపి రాష్ట్రం పరువుతీశారు. కర్నూలు బస్సు దుర్ఘటనకు బెల్టు షాపులే కారణమంటూ 2025 అక్టోబర్ 26న వైఎస్సార్సీపీ పోస్టు పెట్టింది. ముఖ్యమంత్రిని అవమానించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ పోస్టులు తొలగించాలంటూ ‘ఎక్స్’కు నోటీసు పంపారు. గుంటూరులో ఇద్దరు నేతల ఎక్స్ పోస్టుల తొలగింపునకు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ ఈ–మెయిల్ నుంచి ఇన్స్పెక్టర్ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేశారు. అందులో ఫిర్యాదు చేసిన సంస్థ పేరును ఎఫ్బీఐ అని రాశారు. అది ఎఫ్బీఐ కాదు, ఏపీ పోలీసులేనని, ఎందుకు అలా రాశారో తమకే అర్థం కావడం లేదని ‘ఎక్స్’ సంస్థే బాధితులకు మెయిల్ పంపి గుట్టురట్టు చేసింది.విశాఖ సమీపంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూములు బలవంతంగా తీసుకుంటున్నారని తర్లువాడ రైతులు చేసిన వీడియోను అంతర్జాతీయ జర్నలిస్టుల నెట్వర్క్ ‘ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కలెక్టివ్’ ప్రచురించింది. ఆ రీల్ భారత్లో కనిపించకుండా పోయింది.
అప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ.. ఇపుడు సెన్సార్షిప్..
భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు.. అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతుపై ఆంక్షలా? అంటూ నిలదీస్తున్నాయి. ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలకు సమాధానం ఇవ్వడం, వాస్తవాలను ప్రజలకు వివరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజ ప్రక్రియ. కానీ చంద్రబాబు మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉంటే భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలి.. అధికారంలోకి వస్తే అన్నిటికీ సెన్సార్షిప్.. ఇదేం న్యాయం నారా వారూ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
డీఎస్సీలో అక్రమాలు.. సోషల్ మీడియాలో ప్రకంపనలు
డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మంలో జరగని జూడో టోర్నమెంట్లో పాల్గొన్నట్లు కొందరు అభ్యర్థులు సర్టిఫికెట్లు సమర్పించారు.. సాఫ్ట్బాల్ విషయంలోనూ ఇదే తంతు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి తన రిజర్వేషన్ కేటగిరీలో టెట్లో అర్హత సాధించకపోయినా ఉపాధ్యాయ ఉద్యోగం పొందారు. వీటిపై ప్రభుత్వం సమగ్రంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో.. వాటిని ప్రచారం చేస్తున్న ఖాతాలపై తప్పుడు ఫిర్యాదులతో చర్యలు తీసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
150 ఖాతాలు.. 770 పోస్టులు జర్నలిస్టులు, సాధారణ పౌరులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల పోస్టులపై ఏపీ సీఐడీ ‘ఎక్స్’కు లీగల్ అభ్యర్థనలు పంపి వాటిని మూసివేయించడానికి ప్రయత్నించింది. 150కి పైగా ఖాతాలకు చెందిన 770కి పైగా పోస్టులు ఆ అభ్యర్థనల్లో ఉన్నాయని, ఏకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖాతా కూడా లక్ష్యంగా మారిందని ఆ పార్టీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా తొలగించేలా చేశారు. తర్వాత పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ భారత్లో కనిపించకుండా పోయింది. తీవ్ర విమర్శలు రావడంతో చివరికి పునరుద్ధరించారు. ఒక గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారిక పేజీనే మూయించే స్థాయికి చంద్రబాబు దిగజారారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


