మెగా డీఎస్సీ 2025 కుంభకోణంలో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి
కుటుంబ సభ్యుల కోసం అడ్డదారులు తొక్కిన సాఫ్ట్బాల్ అసోసియేషన్ నేతలు
కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో కార్యదర్శుల భార్య, కుమార్తెలకు టీచర్ ఉద్యోగాలు
స్పోర్ట్స్ కోటా ముసుగులో పరీక్షలే లేకుండా ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ
జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి సత్తా చాటిన నిజమైన ప్రతిభావంతులకు మొండిచెయ్యి
డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండూ ఒకరి చేతికే
అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్.. అయినా ‘నో పోస్టింగ్’
అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటా ముసుగులో అక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల కలకలం..
లోకేశ్ యువగళం టీమ్ సభ్యులకు టీచర్ పోస్టులు
టెట్ క్వాలిఫై కాకపోయినా అనర్హులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు
మెగా డీఎస్సీలో ఒక్కొక్కటిగా బద్దలవుతున్న పాపాల పుట్టలు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 భారీ కుంభకోణంలో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే పాపాల చిట్టా చాంతాడులా పెరిగిపోతోంది. స్పోర్ట్స్ కోటా ముసుగులో అసలు పరీక్షలే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఒక ఎత్తు కాగా అందులోనూ క్రీడా అసోసియేషన్ల నేతల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ ప్యాకేజీ మాదిరిగా పోస్టులు ఇచ్చుకున్నట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ విజేతలను పక్కనపెట్టి కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేయడం మెగా డీఎస్సీ అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండూ ఒకరి చేతికే అప్పగించి స్కామ్కు తెర తీయడం.. ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనడం.. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగి డీఎస్సీలో టాప్ ర్యాంకర్గా నిలవడం.. కానీ ఆ టాప్ ర్యాంకర్కు పోస్టు ఇవ్వకపోవడం.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్చేసి అక్రమాలకు గేట్లు ఎత్తడం.. పని పూర్తి కాగానే గేట్లు మూసేయడం.. అభ్యర్థులను 1:1లో వెరిఫికేషన్కు పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం.. సర్దుబాటు పేరుతో బుకాయించడం.. టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియో, వీడియోలు బట్టబయలైనా అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడం.. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో క్వాలిఫై కానివారికి కూడా టీచర్ పోస్టులు ఇవ్వడం.. లోకేశ్ యువగళం టీమ్ సభ్యులకు టీచర్ పోస్టులు కట్టబెట్టడం.. లాంటివన్నీ మెగా డీఎస్సీ స్కామ్కు తిరుగులేని సాక్ష్యాధారాలని విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐతో విచారించాల్సిందేనని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిభతో పనిలేదు.. పార్టిసిపేషన్ సర్టిఫికెట్ చాలు!!
ప్రతిభావంతులైన నిజమైన క్రీడాకారులకు అండగా నిలిచి వారిని ప్రోత్సహించాల్సిన క్రీడా సంఘాల నేతలు తమ కుటుంబ సభ్యుల కోసం అడ్డదారులు తొక్కారు. రాష్ట్ర సాఫ్ట్బాల్æ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అండతో సంఘం కార్యదర్శులు తమ భార్య, కుమార్తెలకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు వచ్చేలా చేసుకున్నారు. వాటి ద్వారా మెగా డీఎస్సీలో ఎలాంటి పరీక్ష రాయకుండానే నేరుగా ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలను పొందారు. వారంతా ఇప్పుడు అడ్డదారిలో వచ్చిన కొలువుతో ఉపాధ్యాయులుగా చలామణి అవుతున్నారు. నిజానికి స్పోర్ట్స్ కోటా ఎంపికలో కేవలం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా క్రీడలో ప్రతిభ, సాధించిన స్థానం, నిర్దేశిత ప్రాధాన్యత (ప్రయారిటీ) ఆధారంగా అర్హతను నిర్ణయించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా కేవలం పాల్గొన్న ధ్రువపత్రం (పార్టిసిపేషన్ సర్టిఫికెట్)తో టీచర్ పోస్టులు ఇచ్చేశారంటే దీని వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
అక్రమాలకు సాక్ష్యాలివిగో...
వైఎస్సార్ కడప జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేసిన గండికోట ప్రసాద్ కుమార్తె జి.రుచిత సాఫ్ట్బాల్ సర్టిఫికెట్తో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టు పొందారు. ఆయన ప్రస్తుతం ఎంఈవోగా రాజుపాలెం మండలంలో పని చేస్తున్నారు. రుచిత లింగాల మండలం పెద్దకుడాల హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పని చేస్తుండగా ఇటీవల సర్దుబాటులో భాగంగా లింగాల హైసూ్కల్కు మారారు. ఆమె 2018 జూన్ 15 నుంచి 17 వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఇంటర్ డి్రస్టిక్ సాఫ్ట్బాల్ చాంపియన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో పాల్గొన్నట్లు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించారు. 2019 జనవరి 12వ తేదీ నుంచి 16 వరకు నాగ్పూర్ కస్తూరి చాంద్ పార్క్గ్రైండ్లో 40వ సీనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో కూడా పాల్గొన్నట్లు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొంది వాటితోనే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది.
శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవీ రమణ భార్య లక్ష్మీదేవి సాఫ్ట్బాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో విజయనగరం జిల్లాలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయురాలిగా మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించారు. అనంతపురం జిల్లాలో 2016లో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్æ సమర్పించారు.
తూర్పు గోదావరి జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఏఎన్ రామప్రసాద్ భార్య కోలపల్లి నాగలక్ష్మి 2023లో శ్రీనగర్లో సాఫ్ట్బాల్æ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు మెగా డీఎస్సీలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించారు. ఆమె స్వస్థలం కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంజువరం కాగా ఆమె భర్త రామప్రసాద్ ఐ.పోలవరం మండలం జి.మూలపొలం ఉన్నత పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పీఈటీగా పనిచేస్తున్నారు.
విజయనగరం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ చాకాలపు సత్యనారాయణ భోగాపురం మండలం తూడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య లీలా శివజ్యోతి అనంతపురంలో 2021 డిసెంబర్ 24 నుంచి 28 వరకు జరిగిన సీనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మాత్రమే పొందారు. అయితే రెండో స్థానం (సిల్వర్ మెడల్) సాధించినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూన రవికుమార్ ధ్రువపత్రం జారీ చేశారు. ఈ పత్రంతో ఆమె మెగా డీఎస్సీలో 42 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించారు. విశాఖ జిల్లా స్థానికతతో స్కూల్ అసిస్టెంట్ మేథమెటిక్స్ పోస్టు దక్కించుకున్నారు.


