సాక్షి,తాడేపల్లి: ఏపీ పోలీసులు ఎఫ్బీఐ పేరును వాడటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. చంద్రబాబు పాలనలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు.
‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ఎఫ్బిఐ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ.. మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను ‘ఎఫ్బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య.
ఆ మెయిల్స్ అన్నీ ఏపీ పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచే వచ్చాయని ‘ఎక్స్’ ధృవీకరించింది.ఆ మెయిల్ పంపిన ఇన్స్పెక్టర్ తాను ‘ఎఫ్బీఐ’ అధికారినని ఎలా చెప్పుకున్నారు?.అసలు ఆ మెయిల్ పంపాలని ఆదేశించింది ఎవరు?‘ఎఫ్బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు?.మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు..‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా?
అమలు చేయని సూపర్ సిక్స్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులపై పోస్టులు పెడితే ఎందుకు తొలగిస్తున్నారు?. పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్షిప్ను అమలు చేయడానికి కాదు.రాజకీయ ప్రయోజనాల ఏకంగా ఎఫ్బీఐ పేరును వాడటం ఏపీకి అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తిన్నది.
విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని,గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువుతో నష్టపోయిన రెతులను ఆదుకోవటానికి వాడండి.యువతకు ఉద్యోగాలు కల్పించండి.అలా నిజమైన అభివృద్ధి చేసి చూపండి. ఇకనైనా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి.ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. ప్రజలకు మంచి చేసే విషయంలో మీ పనితీరును చూపండి.ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్షిప్, వేధింపులతో కాదు’’అని వైఎస్ జగన్ ఎక్స్లో తెలిపారు.
.@ncbn గారి పాలనలో రాష్ట్రంలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు.
చంద్రబాబు గారూ, మీ పాలనలో ఇదేనా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2026


