సాక్షి, విజయవాడ: ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టయిన యూట్యూబర్, నందూస్ వరల్డ్ చానల్ నిర్వాహకురాలు రమా నందన పోలీసుల ఎదుట నోరు విప్పడం లేదు. రెండుసార్లు విచారించినా పురోగతి కనిపించలేదు. ఈ నెల 8న తొలిసారి ఇబ్రహీంపట్నం పీఎస్లో విచారణ జరిపారు.
నిన్న(మంగళవారం) మరోమారు అర్ధగంట పాటు మాత్రమే విచారణకు రమానందన హాజరయ్యారు. రమానందన నుంచి పోలీసులు వాస్తవాలను రాబట్టలేకపోయారు. తూతూమంత్రంగానే పోలీసులు రమానందనను విచారిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. రమా నందన మంగళవారం గుట్టుచప్పుడు కాకుండా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
వీసా స్కామ్లో ఈ నెల ఎనిమిదో తేదీన ఆమె విచారణకు హాజరైన సమయంలో ఈ నెల 16న మరో సారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఆమె ఒకరోజు ముందుగానే వచ్చి వెళ్లిపోయింది. ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులు ఇబ్రహీంపట్నం వచ్చేందుకు సిద్ధమవడంతో ఒకరోజు ముందుగానే ఆమె హాజరైనట్లు తెలుస్తోంది. మీడియా, బాధితుల కంట పడకుండా పోలీసులు ఆమెకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ‘రమానందన తన భర్తను దాచేసేది’


