సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 2,600 కోట్ల అప్పును తీసుకుంది. ఈ తాజా రుణంతో కలిపి, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 25 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రం చేసిన మొత్తం అప్పుల విలువ ఏకంగా రూ. 3,55,000 కోట్లకు చేరింది.
దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు ఆర్థిక రంగాన్ని, రాజకీయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం అధికారిక బడ్జెట్ ద్వారానే కాకుండా, వివిధ కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బడ్జెట్ వెలుపల కూడా భారీగా నిధులను సమీకరిస్తోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
చంద్రబాబు పాలనలో జరిగిన అప్పుల అంతర్గత వివరాలు పరిశీలిస్తే.. బడ్జెటరీ అప్పులు రూ. 1,97,000 కోట్లు కాగా, బడ్జెట్ వెలుపలి అప్పులు రూ. 1,12,504 కోట్లుగా ఉన్నాయి. వీటికి తోడు అమరావతి పేరిట మరో రూ. 47,387 కోట్ల మేర రుణాలను సేకరించారు.


