
మీ తప్పుల వల్ల టెన్త్ విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు
కోరిన ప్రతి విద్యార్థికి ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి
తుది ఫలితాలు వచ్చే వరకూ అడ్మిషన్లను నిలిపివేయాలి
తప్పులకు బాధ్యులైన లోకేశ్ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి
మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యావ్యవస్థే ఇలా ఉంటే మిగిలిన రంగాలను ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలంటించారు. టెన్త్ పరీక్షల నిర్వహణలో చంద్రబాబు, లోకేశ్ పూర్తిగా ఫెయిలయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పదో తరగతి మూల్యాంకనంలో జరిగిన తప్పులను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమని నిలదీశారంటే..
విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ కష్టాలే
చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిలయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణతిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.
దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు.. ఘోరంగా విఫలమై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకు వచ్చారు.
మీరు చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబూ.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?

అనేక సంస్కరణలను దెబ్బతీశారు
మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను అధికారంలోకి వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు–నేడు, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.
లోకేశ్ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి
చంద్రబాబూ.. మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్ మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను